. మిగిలింది ఎనిమిది రోజులే…
. ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ
. 4న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
. పోలీసుల భారీ భద్రత
. 1న సాయంత్రం ఎగ్జిట్పోల్స్
. ప్రధానపార్టీల అభ్యర్థుల్లో గుబులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కౌంటింగ్..కౌంట్డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల మహాఘట్టానికి జూన్ 4న ఫలితాలతో తెరపడనుంది. మరో ఎనిమిది రోజుల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఓటర్ల తీర్పు వెల్లడయ్యేందుకు సమయం ఆసన్నమవుతుండటంతో అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా గెలుపు, ఓటములపై అధికార వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దానిని కప్పి పుచ్చుకునేందుకు గెలుపు ధీమాతో వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఈనెల 13న ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలు పునరావృతం కాకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి భద్రతా చర్యలకు పోలీసు యంత్రాంగం ఉపక్రమించింది. జిల్లాల్లోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా మూడంచెల భద్రతా చర్యలు తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమేరాలతో నిఘా పెట్టి… నిరంతరం వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా నెలకొన్న హింసాత్మక సంఘటనలు మళ్లీ కౌంటింగ్ సమయంలోనూ పునరావృతమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. జూన్4న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రధాన దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని జిల్లాలకు 58 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు. పల్నాడుజిల్లాకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులతో కట్టుదిట్ట భద్రతా చర్యలకు డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు దాదాపు 30వేల మంది సిబ్బంది హాజరుకానున్నారు. వారికి శిక్షణ ఇవ్వడంలో ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఓట్ల లెక్కింపును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు 200 మంది కేంద్ర ఎన్నికల పరిశీలకులు, మరో 200 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు.
వైసీపీ, ఎన్డీఏకు గెలుపు ప్రతిష్ఠాత్మకం
విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014, 2019లో రెండు విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మూడోసారి 2024లో ఎన్నికలు జరగ్గా… ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 2014లో ఎన్డీఏ కూటమి పార్టీలు జట్టుకట్టి 106 సీట్లతో అధికారాన్ని ఛేజిక్కించుకోగా, వైసీపీ 67 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఆ తర్వాత 2019లో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. టీడీపీ 23 సీట్లతోనే ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆ రెండు ఎన్నికలతో పోలిస్తే…2024 ఎన్నికలకు పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఈ ఎన్నికల ఫలితాలు వైసీపీ, ఎన్డీఏ కూటమి పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈనెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 3,33,40,333 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇందులో పురుషులు 1,64,133 మంది, మహిళలు 1,69,08678 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళల సంఖ్య 5లక్షలకుపైగా అధికంగా ఉంది. దాదాపు అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉంది. 4న ఓట్ల లెక్కింపుతో రాజకీయ పార్టీల జాతకాలు బయటపడనున్నాయి.
అధినేతలకు ముందే ఎగ్జిట్ పోల్స్ సమాచారం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ను బహిరంగంగా వెల్లడిరచనున్నారు. కొన్ని ప్రామాణిక సంస్థలు ఎన్నికల రోజు నాటికే తమ సర్వేలను పూర్తి చేశాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వాటిని 1వ తేదీ సాయంత్రం వరకు విడుదల చేయకూడదు. ప్రధాన సంస్థల సర్వే నివేదికల సమాచారం ముందస్తుగానే పార్టీ ముఖ్యనేతలకు చేరినట్లు తెలిసింది.దీంతో ఎవరికి వారే ధీమాతో ఉన్నారు.ఆ సర్వేల ఆధారంగానే సీఎం జగన్ తిరిగి అధికారంలోకి వస్తామని ప్రకటించారు.ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఉన్న సర్వేలతో కూటమి అధికారంలోకి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీని ఆధారంగా అధినేతలకు ముందస్తుగానే ఎగ్జిట్పోల్స్ సమాచారం అందినట్లుగా ప్రచారముంది. 1వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాక…బెట్టింగ్ రాయుళ్లకు ఒక స్పష్టత వస్తుంది. అప్పటి నుంచి బెట్టింగ్లు మరింత వేగవంతం కానున్నాయి.
పోలింగ్ ముగిసిన వెంటనే విదేశాలకు వెళ్లిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఈనెలాఖరుకు లేదా జూన్ 1వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. విదేశీ పర్యటనలో చంద్రబాబు, పవన్ కూడా తిరిగి వస్తారు. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా తమ ఏజెంట్లకు దిశానిర్దేశం చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రాథమిక వైద్య సౌకర్యాల్ని అందుబాటులో ఉంచుతున్నారు.అభ్యర్థులకు బీపీ టెస్ట్లతోపాటు అత్యవసరం అనుకున్న వారిని ఆస్పత్రులకు తరలించేలా అంబులెన్స్ సదుపాయాలను కల్పిస్తున్నారు.