కోస్తా జిల్లాలు అతలాకుతలం
. పొంగుతున్న వాగులు, వంకలు
. తీరం వెంట 65 కి.మీ వేగంతో గాలులు
. పెదవాగు ఉధృతితో రహదారులన్నీ ధ్వంసం
. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
. నేడు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎగువ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నదికి కూడా వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిరది. వాయవ్య దిశగా పయనించి, పూరీ సమీపంలో శనివారం తెల్లవారు జామున తీరం దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత క్రమంగా బలహీనపడనుంది. దీని ప్రభావంతో శనివారం కూడా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు వాయుగుండగా బలపడిన అల్పపీడనం రేపు ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఏపీలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ఈ మేరకు కోస్తా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు… కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. తీరం వెంబడి అత్యధికంగా గంటకు 65 కిమీ వేగంతో గాలులు వీస్తుండటంతో వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం 3 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విశాఖ సమీపంలోని జ్ఞానాపురం పాతవంతెన వద్ద వరద నీరు నిలిచిపోయింది. ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నందున విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. వేలేరుపాడు మండలంలో ఆకాశానికి రంధ్రం పడిరదా అన్నట్లుగా కురిసిన వర్షం వలన వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లి వరద ఉధృతి ప్రజలను హడలెత్తిస్తోంది. మండలంలోని లోతు వాగు, ఎద్దు వాగు, పెద్ద వాగు తదితర వాగులు ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులను గురిచేస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న వరదతో, ఎడతెరిపిలేని కురుస్తున్న వర్షం వలన పల్లపు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. వాగులు పరీవాహక ప్రాంతాల్లోని రహదారులు ఎక్కడికక్కడే నీట మునిగి వరద ఉధృతికి అనేకచోట్ల గండ్లు పడ్డాయి. ఈ మండలంలోని ప్రధాన రహదారులు సైతం కొట్టుకుపోవడంతో బాహ్య ప్రపంచంతో మండలానికి సంబంధాలు తెగిపోయాయి. వరద మధ్యలో, పల్లపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను అధికారులు మెరక ప్రాంతాలకు తరలిస్తున్నారు. తెలంగాణ పరిధిలోని పెద్ద వాగు ప్రాజెక్టు విలీన మండలాలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదకు దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోని పంట పొలాలు నామరూపాలు లేకుండా దెబ్బతిన్నాయి. కమ్మరిగూడెం, మేడేపల్లి, కోయమాదారం, అల్లూరి నగర్, రాళ్లపూడి, వసంతవాడ, మద్దిగట్ల, పాతపూచిరాల తదితర గ్రామాలకు పెద్ద వాగు ప్రాజెక్టు వలన భారీ నష్టం చేకూరింది. పంట భూముల్లో ఇసుక మేటలు వేశాయి. పశువులు, మేకలు కూడా వరదలకు కొట్టుకుపోయాయి. 25 సంవత్సరాల క్రితం అదే ప్రాజెక్టు తెగిందని, మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొని తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని స్థానికులు వాపోతున్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోండి : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆయా జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు.
ముందస్తు ప్రణాళికతో పని చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 185 మి.మి గాను 244 మి.మి నమోదయిందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదయిందని అన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్న సీఎం, చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలని చెప్పారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని, అధికారులు ఎల్లవేళలా అప్రమత్తతతో వ్యవహరించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.