. అడ్డుకున్న పోలీసులు… అరెస్టులు
. ఆర్థిక సంఘం నిధులు ఇవ్వకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరిక
విశాలాంధ్ర – తాడేపల్లి : సర్పంచులు తలపెట్టిన పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. రాష్ట్రప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ… తాడేపల్లిలోని పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర సర్పంచుల సంక్షేమ సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి సర్పంచులు ఆందోళనకు దిగారు. దీంతో అనేకమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది సర్పంచులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పోలీసుల వైఖరిపై సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టు చేస్తారా? రావాల్సిన బకాయిలు, నిధులు వెంటనే విడుదల చేయాలి. 20 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించట్లేదు. నిధులు లేక గ్రామాల్లో రోడ్లు కూడా వేయలేని దుస్థితి ఏర్పడిరది. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులు పంచాయతీ ఖాతాల్లో వేయాలి’’ అని సర్పంచులు డిమాండ్ చేశారు.
15వ ఆర్థిక సంఘం నిధులు రూ.691 కోట్లు వచ్చి 40 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు అధ్వర్యంలో సోమవారం తాడేపల్లి బైపాస్ రోడ్డులో ఉన్న పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఒక్కసారిగా వందలాది మంది సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనరేట్ వైపు దూసుకు రావటంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి పెదకాకాని పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్లు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల సర్పంచ్ల ఆధీనంలో గ్రామ సచివాలయాల కార్యకలాపాలు జరగాలని, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని రూ.3వేల నుంచి రూ.15 వేలుకు పెంచాలని, మైనర్ పంచాయతీల కరెంట్ బిల్లులు, తాగునీటి సరఫరా, వీధిలైట్లు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. గ్రామ సచివాల యాలపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీల ఖాతాల్లోనే జమ చేయాలని, గిరిజన తండాలను ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని, గ్రామ పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి పంచాయతీలకు నిధులు ఆపిన చరిత్ర లేదని అన్నారు. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్లందరూ వారి ఫోన్లపై ‘జగనన్న మా నమ్మకం’ స్టిక్కర్లు అతికించుకోవడం జరిగిందని, కానీ ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి పోగొట్టుకు న్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావలసిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతామని హెచ్చరిం చారు. కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సర్పంచ్లకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. ఈ ముట్టడి కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు(న్యూదిల్లీ) డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూ విజయ్ కుమార్, కార్యదర్శి టి.కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు అప్పి రెడ్డి, అల్లాబక్షు, కె.ధర్మరాజు, రమేష్ రెడ్డి, సర్పంచ్ల సంఘ నాయకులు ముప్పాళ్ల మనోహర్, తోకల సరోజినీ నరసింహారావు, జయరాం రెడ్డి, సురేషు రామకృష్ణ, రాముడు, జానకి దేవి, నాగమణి, శ్రీనివాసరెడ్డి, సొంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.