సీఎం క్యాంపు కార్యాలయానికి ఆశావహుల ‘క్యూ’
. వెనక్కి తగ్గని పార్థసారథి
. మల్లాది, వెలంపల్లితో సీఎం చర్చలు
. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో టెన్షన్
విశాలాంధ్రబ్యూరో-అమరావతి: అధికార వైసీపీలో సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. కొంతమంది సిట్టింగుల స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టాలని కసరత్తు ప్రారంభించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కొంతమందిని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చిన అధినేత… 13మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వలేనని చెప్పారు. ఇంకా వివిధ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీల మార్పులపై కసరత్తు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు అధిష్ఠానం నుంచి పిలుపునందుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు క్యాంప్ కార్యాలయానికి బారులు తీరారు. సీఎంవో నుంచి వచ్చిన పిలుపుతో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, తెల్లం బాలరాజు, జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఇటీవల తనకు శింగనమల సీటు రాదనే అసంతృప్తితో ప్రభుత్వ తీరుపై జొన్నలగడ్డ పద్మావతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఎస్సీ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్తోపాటు సజ్జలను ఆమె కలిసి సమస్యల్ని వివరించారు. అనంతరం జొన్నలగడ్డ పద్మావతి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… తాను పోరాడుతున్నది అధికారులతోనేనని స్పష్టంచేశారు. చిన్న పనికి సైతం సీఎం జగన్ దగ్గరకు వెళ్లాల్సి వస్తోందని మాత్రమే ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆమె వివరణ ఇచ్చారు. టీడీపీ తరపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మరోపక్క తనకు ఎమ్మెల్యే మల్లాది వర్గం సహకరించడం లేదంటూ ఆధిష్ఠానం దృష్టికి వెలంపల్లి తీసుకెళ్లిన విషయం విదితమే. దీంతో వెలంపల్లి, మల్లాదిని క్యాంపు కార్యాలయానికి పిలిపించి, వారిద్దరితో సీఎం జగన్ చర్చించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఇప్పటికే పేరు ప్రకచించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే విష్ణు పార్టీ వీడేందుకు సిద్ధపడటం, షర్మిల రాగానే కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు వెళ్లాలని భావిస్తుడంటంతో వెలంపల్లికి పిలుపు వచ్చింది. ఎలా ముందుకు పోవాలనే విషయంపైనా చర్చించారు. అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు పార్థసారథి, మల్లాది విష్ణుతో వైసీపీ సీనియర్ నేతలు చర్చలు నిర్వహిస్తున్నారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి మంగళవారం మరోసారి పెనమలూరులో పార్థసారథిని కలిశారు. వారిద్దరి మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలిసింది. అటు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని వైసీపీ తిరిగి బరిలో నిలపనుంది. సీఎంతో ఎమ్మెల్యే బాలినేని భేటీ అనంతరం ఒంగోలు ఎంపీ సీటుపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన అమలాపురం ఎంపీ చింత అనురాధ పార్లమెంట్ సీటు విషయమై చర్చించారు. కొన్ని రోజులుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు మరోసారి వచ్చి మంతనాలు జరిపారు. హిందూపురం ఎంపీ సీటు శాంత కు కేటాయించడంతో ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ మరోసారి అధినేతను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. తనకు ఏదేని శాసనసభ స్థానమైనా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి బొత్స సత్య నారాయణ విజయనగరం ఎంపీ సీటు అభ్యర్థి విషయమై చర్చించారు. తన సతీమణి బొత్స రaాన్సీని విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని బొత్స యత్నిస్తున్నారు. ఇదే విషయమై సీఎంతో చర్చించినట్లు తెలిసింది. కర్నూలు జిల్లా డోన్ లో నియోజకవర్గ సమన్వయకర్తను మార్చేందుకు సీఎం చర్యలు తీసుకుంటుండటంతో మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నుంచి మరో సారి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తను పోటీచేసే సీటు విషయమై చర్చించారు. ముందుగా ప్రాంతీయ సమన్వయకర్తలను కలసి చర్చించాక అవసరం మేరకు నేతలు అధినేతను కలిస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ స్థానంలో కొత్త సమన్వయకర్తను నియమించాలని సీఎం నిర్ణయించారు. ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే గీతా శ్రీ పేరును పరిశీలిస్తున్నారు. ఈ సారి పోలవరం అసెంబ్లీ నుంచి తన భార్యను బరిలో నిలపాలని తలంచిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సంప్రదింపులు జరిపారు.