. సభాపతి స్థానం కోసం చంద్రబాబు, నితీశ్ పట్టు
. ససేమిరా అంటున్న బీజేపీ అధిష్ఠానం
. మెజారిటీ లేకపోవడంతో మిత్రపక్షాల కటాక్షం కోసం పాట్లు
న్యూదిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మొదటిసారి (2014), రెండవసారి (2019) ఏర్పడ్డ ప్రభుత్వాలు… సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వరుసగా పది, ఏడు రోజులలో ప్రమాణ స్వీకారం చేశాయి. అప్పట్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ స్థానాలను బీజేపీ సొంతంగానే గెలుచుకుంది. ఈసారి (2024) తగినంత మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కాషాయపార్టీ అధిష్ఠానం కీలక మిత్రపక్షాలైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్కుమార్లతో మంత్రిపదవులపై ఏకాభిప్రాయం సాధించడానికి సుదీర్ఘ చర్చలు జరపవలసి వచ్చింది. మరోపక్క ఇండియా కూటమి కూడా మెజారిటీ మార్కుకు చేరువగా రావడంతో ఆలస్యం చేయకుండా తీర్పు వెలువడిన నాలుగు రోజులకే 72 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని బీజేపీ ఏర్పాటు చేయగలిగింది. కానీ కీలకమైన లోక్సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ లేనందున భాగస్వామ్య పక్షాల ఆమోదం లేకుండా స్పీకర్ పదవి దక్కించుకోలేదు. ఈ ఎన్నికల్లో కింగ్మేకర్లుగా అవతరించిన టీడీపీ, జేడీయూలు రెండూ కీలక స్థానంపై కన్నేశాయని వార్తలొస్తున్నాయి. అయితే ఆ పార్టీలకు స్పీకర్ పదవిని అప్పగించేం దుకు అధిస్ఠానం ఆసక్తి చూపడం లేదని బీజేపీ వర్గాలు చెబుతు న్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కొత్త లోక్సభ మొదటి సారి సమావేశమయ్యే ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. రాష్ట్రపతి నియమించిన ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తదనంతరం సాధారణ మెజారిటీతో లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారు. లోక్సభ స్పీకర్గా ఎన్నిక కావడానికి నిర్దిష్ట ప్రమాణాలు లేకపోయినా, రాజ్యాంగం, పార్లమెంటరీ నిబంధనలపై అవగాహన కలిగి ఉంటే మంచిది. బీజేపీ మెజారిటీ సాధించిన గత రెండు లోక్సభల్లో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్లుగా ఉన్నారు. అయితే స్పీకర్ పదవి చేపట్టడం చాలా క్లిష్టమైన బాధ్యత. సభను నడిపే వ్యక్తిగా, స్పీకర్ పదవి పార్టీలకతీతంగా ఉండాలి. కానీ దానిని చేపట్టే వ్యక్తి ఒక నిర్దిష్ట పార్టీ ప్రతినిధిగా ఎన్నికలలో గెలిచిన తర్వాత పదవి స్వీకరిస్తారు. కానీ, 1967 లోక్సభకు స్పీకర్గా ఎన్నికైన వెంటనే కాంగ్రెస్ పార్టీతో తన మూడున్నర దశాబ్దాల అనుబంధానికి నీలం సంజీవరెడ్డి ముగింపు పలికారు. స్వచ్ఛందంగా ఆయన పార్టీ సభ్యత్వానికి ‘రాజీనామా’ చేశారు. స్పీకర్ అంటే అన్ని పార్టీలకు సమదూరంలో ఉంటూ సభను సజావుగా నడిపించాల్సిన వ్యక్తి అన్న భావనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వతంత్ర భారతంలో ఈ ప్రమాణాన్ని నెలకొల్పిన మొదటి లోకసభ స్పీకర్గా సంజీవరెడ్డి చరిత్రకెక్కారు. ఆయన తర్వాత ఇంత వరకూ ఎవరూ తమ పార్టీకి రాజీనామా చేసిన దాఖలాలు లేవు. ఇక, 2004 నుంచి 2009 వరకూ స్పీకర్గా ఉన్న సోమనాథ్ ఛటర్జీని సీపీఎం సస్పెండ్ చేసినా ఆయన పదవిలో కొనసాగారు. 2008లో నాటి యూపీయే ప్రభుత్వంపై కమ్యూనిస్టు పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా… సోమనాథ్ ఛటర్జీ పార్టీ విప్ను ధిక్కరించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ స్పీకర్ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సంవత్సరాల్లో పార్టీలు చీలిపోయి ప్రభుత్వాలు కూలిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సభకు అధిపతిగా స్పీకర్ కీలక పాత్ర పోషిస్తారు. విప్లను ధిక్కరించే సభ్యులపై అనర్హత వేటు వేసే అధికారం ఆయనకు ఉంటుంది. ‘ఫిరాయింపు కారణంగా సభ్యులపై అనర్హత వేటు వేయాల్సి వస్తే దీనిని నిర్ణయించడంలో సభాపతి లేదా స్పీకర్కు సంపూర్ణ అధికారం ఉంటుంది’ అని చట్టం పేర్కొంది. నిజానికి తమ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని నితీశ్ కుమార్ గతంలోనే ఆరోపించారు. అందువల్ల తిరుగుబాట్లతో పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తే… అటువంటి వ్యూహానికి వ్యతిరేకంగా స్పీకర్ పదవిని కవచంగా మార్చుకోవచ్చినేది బాబు, నితీశ్ ఉద్దేశంగా భావిస్తున్నారు. మోదీ 3.0 కేబినెట్లో టీడీపీ, జేడీయూలకు రెండేసి చొప్పున మంత్రి పదవులు దక్కాయి (ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి). ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. జేడీయూ, టీడీపీలు ఈ పదవి కోసం పట్టుబ డుతున్నట్టు మీడియాలో ప్రచారం సాగుతోంది. కానీ, వాటికి అప్పగిం చడానికి అధిష్ఠానం సిద్ధంగా లేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి.