బీజేపీ, టీడీపీ, వైసీపీ ద్రోహం చేశాయని విమర్శ
విశాలాంధ్ర బ్యూరో- దిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా కోసం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం దిల్లీలోని ఏపీ భవన్ అంబేద్కర్ విగ్రహం ఎదుట దీక్ష చేపట్టారు. హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను బీజేపీ మోసం చేస్తే…టీడీపీ, వైసీపీ విస్మరించాయని షర్మిల విమర్శించారు. ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎన్.రఘువీరారెడ్డి, కొప్పుల రాజు, కేవీపీ రామచంద్రరావు, జేడీ శీలం, గిడుగు రుద్రరాజు, షేక్ మస్తాన్ వలీ, పార్టీ ముఖ్యనేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. షర్మిల మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై సాధన కోసం తాము దీక్ష చేపట్టామన్నారు. విభజన సమయంలో హామీ ఇచ్చిన పోలవరం, రాజధాని నిర్మాణం, విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల ముందు నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు చెత్తబుట్టలో పడేశారన్నారు. పదేళ్లు పూర్తయినా హామీలు అమలు చేయలేదని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు కూడా పూర్తికావచ్చిందని గుర్తుచేశారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, వైజాగ్ రైల్వే జోన్, దుగ్గిరాజపట్టణానికి పోర్ట్, వైజాగ్ నుంచి చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆశ్చర్యమేమంటే ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకుండా ఆంధ్రప్రదేశ్ను బీజేపీ పాలిస్తోందని షర్మిల విమర్శించారు. బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిలుగా మారాయన్నారు. బీజేపీపై వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాటం చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రజలతో కోటి సంతకాలు సేకరించి ప్రధానికి ఏటా కాంగ్రెస్ లేఖ ఇస్తూనే ఉందని షర్మిల తెలిపారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదా ఫైలుపై మొదటి సంతకం చేస్తామన్నారు. హోదాతోపాటు విభజన హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ ఉద్యమిస్తూనే ఉంటుందన్నారు. దీక్షలో కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, షర్మిల, కాంగ్రెస్ ముఖ్యనేతల బృందం వివిధ పార్టీల నేతలను కలిసి ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పార్లమెంట్లో ప్రస్తావించాలని కోరింది. ఎన్సీపీ అధినేత శరద్పవార్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులను కలిసి విన్నవించింది.