. ఎవరికి ఏ స్థానం… ఏ పార్టీకి ఎన్ని సీట్లో తేలుతుంది
. 545 లోక్సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పరిశీలకులు
. కచ్చితమైన సంఖ్యపై త్వరలో ప్రకటన: ఖడ్గే
. ‘న్యాయ్’ యాత్ర లోగో ఆవిష్కరణ
న్యూదిల్లీ : మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఉక్కు సంకల్పంతో ముందుకెళుతోంది. కలిసి వచ్చే పార్టీలతో కూటమిని బలపర్చుకుంటూ ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలని, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వంటి అనేక అంశాలపై సమాలోచనలు జరుపుతోంది.ఏదిఏమైనా ఇండియా కూటమి సీట్ల సర్దుబాటును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని పట్టుదలగా ఉంది. దీనిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే తెలిపారు. మరో 10`15 రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతుందని చెప్పారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర లోగోను పార్టీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్తో కలిసి ఖడ్గే శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సన్నద్ధమవుతోందని ఆయన అన్నారు. 545 లోక్సభ నియోజకవర్గాలపై పార్టీ దృష్టి పెట్టిందని, అన్ని స్థానాలకు ఎన్నికల పరిశీలకులను నియమించిందని చెప్పారు. ఏ పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వంటివాటిపై కూటమి పార్టీల నాయకులతో చర్చించాక ఖరారు చేయనున్నట్లు ఖడ్గే తెలిపారు. మీ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఓ విలేకరి ప్రశ్నించగా ‘అన్ని నియోజకవర్గాల కోసం పార్లమెంటరీ పరిశీలకులను నియమించుకున్నాం. ప్రతి నియోజకవార్గానికి వెళ్లి, క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలిస్తాం. చివరికి ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో చర్యలు జరుగుతున్నాయి. త్వరలోనే సంఖ్య ఖరారవుతుంది. ప్రతి చోట మాకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటన్నాం’ అని ఖడ్గే బదులిచ్చారు. ఏదేని అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో పార్లమెంటరీ పరిశీలకులు రంగంలోకి వస్తారని చెప్పారు. కూటమికి కన్వీనర్గా ఎవరు ఉంటారనే ప్రశ్నకు ‘ఇది కౌన్ బనేగా కరోడ్పతి’ అన్న ప్రశ్న వలే ఉందని ఖడ్గే చమత్కరించారు. ‘మేము సమావేశాన్ని నిర్వహిస్తాం.10`15 రోజుల్లో ఎవరికి ఏ స్థానమన్నది నిర్ణయిస్తాం’ అని నొక్కిచెప్పారు. సమస్యలకు ఉమ్మడి పరిష్కారాలకు యత్నిస్తున్నామన్నారు. ముకుల్ వాస్నిక్ కన్వీరన్గా, అశోక్ గెహ్లాట్, భూపేశ్ బాఘెల్ సభ్యులుగా కాంగ్రెస్ ఓ కమిటీని ఏర్పాటు చేసుకుందని, వీరంతా సీట్ల సర్దుబాట్లకు చర్చలు జరుపుతున్నారని వెల్లడిరచారు. ‘ఇప్పటికే నా ఇంట్లో ఒక సమావేశం జరిగింది. మా నాయకులు శాయాశక్తులు ఒడ్డుతున్నారు. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ప్రతి రెండు రోజులకు భేటీ అవుతున్నాం. ఎన్ని సీట్లు డిమాండ్ చేయాలి, ఎన్నింటికి ఒప్పుకోవాలి వంటివి ఖరారు చేస్తున్నాం. వాళ్లు ఫార్మాలిటీ పూర్తి చేస్తున్నారు’ అని ఖడ్గే చెప్పారు. పీసీసీలు, సీఎల్పీలతో ముందు సమావేశమైతే, వారు వెళ్లి ఇతర రాష్ట్రాల నాయకులతో మాట్లాడారని తెలిపారు. 2024 ఎన్నికల్లో వారిని (మోదీ ప్రభుత్వాన్ని) గద్దె దించితే ఈ ఎన్నికల్లోనే మీకు న్యాయం చేకూరగలదు అని ‘న్యాయం జరిగే వరకు’ పోరుపై ప్రశ్నకు ఖడ్గే సమాధానమిచ్చారు. ఇండియా కూటమి పార్టీలు సంయుక్తంగా ర్యాలీలు, సభలు నిర్వహించనున్నాయని, అవి ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరలోనే చర్చించి నిర్ణయిస్తాం అని చెప్పారు. పార్లమెంట్లో సమస్యలు ప్రస్తావించడానికి ప్రభుత్వం అనుమతించట్లేదని, అందుకే భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మణిపూర్లో ఎన్నో దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటి గురించి ప్రధాని మోదీ అనేక చోట్ల ప్రసంగాలిచ్చారు. కానీ ఆ రాష్ట్రానికి వెళ్లలేదు. పార్లమెంట్లో మాట్లాడలేదు. దేశ చరిత్రలో తొలిసారి 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అందుకే, మా గళాన్ని వినిపించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నామని ఖడ్గే వివరించారు. కొత్త కార్మిక చట్టాలు, క్రిమినల్ చట్టాల గురించి మాట్లాడుతూ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను అణచివేసేందుకు ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ తమకు ప్రజల వద్దకు వెళ్లడం మినహా మార్గం లేదనే విషయం ఈ యాత్ర ద్వారా తెలియజేస్తామన్నారు.
పార్లమెంటులో అనేక అంశాలు లేవనెత్తాలని యత్నించినప్పటికీ తమకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈనెల 14వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జరుగుతుంది. ఇది 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. ‘భారత్ జోడో యాత్ర’ పూర్తి స్థాయిలో పాదయాత్ర కాగా.. ‘న్యాయ్ యాత్ర’ మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.