. ఓట్ల లెక్కింపునకు వెళ్లేందుకు అనుమతి
. 6 వరకు ఎలాంటి చర్యలు వద్దు: హైకోర్టు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ నాల్గోతేదీన జరగబోయే ఓట్ల లెక్కింపులో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. ఆరో తేదీ వరకు పోలీసులు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇంతకుముందు ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై నమోదైన కేసుకు సంబంధించిన షరతులే…ఈ మూడు కేసులకూ వర్తిస్తాయని స్పష్టంచేసింది. ఈ కేసులకు సంబంధించి హైకోర్టులో వాదోపవాదనలు కొనసాగాయి. పిన్నెల్లిపై తీవ్ర కేసులు నమోదయ్యాయని, ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పిటిషనర్లు నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగ శిరోమణి తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. పిన్నెల్లి పూర్వ చరిత్రను పరిగణలోకి తీసుకోవాలని, పోలింగ్ రోజు అరాచకాలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తిని లెక్కింపు రోజు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేలా అనుమతించడం శ్రేయస్కరం కాదని కోర్టు దృష్టికి తెచ్చారు. పిన్నెల్లికి బెయిల్ ఇస్తే… ఆయన సాక్ష్యులపై బెదిరింపులకు పాల్పడతారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.నాగిరెడ్డి వాదనలు విన్పిస్తూ, ఓట్ల లెక్కింపు రోజున పిన్నెల్లి నేర ఘటనలు పునరావృతం చేస్తారని పేర్కొన్నారు. ఎన్నికల రోజు ఈవీఎంను ధ్వంసం చేయడంతోపాటు మరుసటిరోజు అనుచరులతో ప్రదర్శనలు నిర్వహించి, ప్రతిపక్ష నేతలను బెదిరించారన్నారు. ఇప్పటివరకు తొమ్మిది కేసుల్లో పిన్నెల్లి నిందితుడిగా ఉన్నారని, పోలీసుల నిఘాకు అందుబాటులో ఉండకుండా కోర్టు ఉత్తర్వుల్ని ఉల్లంఘించారని చెప్పారు. దీనిపై పిన్నెల్లి న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. పిన్నెల్లి కేసులకు సంబంధించి హైకోర్టుకు పోలీసులు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. దీంతో ఈ కేసులు ఎప్పుడు పెట్టారని హైకోర్టు ప్రశ్నించగా, మే 22న నమోదు చేసినట్లు పోలీసుల తరపున న్యాయవాది వివరించారు. దీంతో ఈ కేసులకు సంబంధించిన మొత్తం రికార్డులను కోర్టు ముందు పెట్టాలని హైకోర్టు సూచించగా, వాటిని హైకోర్టు న్యాయమూర్తి పరిశీలించి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ను మంజూరు చేశారు.