మూడు నెలలుగా మణిపూర్ లో కొనసాగుతున్న హింసాత్మక ఆందోళనలలో చోటుచేసుకున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఎంతోమంది కనిపించకుండా పోయారని, వారంతా ఏమయ్యారో తెలియదని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని బాధితులు చెబుతున్నారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 6 వేల జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయినట్లు అధికార వర్గాల సమాచారం. కుటుంబానికి ఆధారమైన కొడుకు కనిపించకుండా పోవడంతో దిక్కులేనివారమయ్యామంటూ ఓ జర్నలిస్టు తల్లి వాపోయారు. రెండు నెలల క్రితం స్నేహితుడితో కలిసి వెళ్లిన జర్నలిస్ట్ ఆటమ్ సమరేంద్ర సింగ్ ఇంటికి తిరిగి రాలేదు. ఇప్పటికీ అతని ఆచూకీ గుర్తించలేకపోయామని పోలీసులు చెప్పారు. నీట్ కోచింగ్ క్లాసులకు వెళ్లిన పదిహేడేళ్ల కూతురు ఇంటికి తిరిగిరాలేదని ఆమె తల్లి వాపోయింది.మరోవైపు, అల్లర్లలో చనిపోయిన వారి మృతదేహాలు ఇంఫాల్ లోని వివిధ ఆసుపత్రుల మార్చురీల్లో ఉన్నాయని, వాటిని సామూహిక ఖననం చేసేందుకు అనుమతివ్వాలని అధికారులను కోరినట్లు ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ నేతలు చెబుతున్నారు.