కేంద్రంపై అరవింద్ కేజ్రీవాల్ మండిపాటు
కేంద్ర సర్కారుపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో దిల్లీ మంత్రి సత్యంద్రజైన్ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడం తెలిసిందే. దీంతో దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సైతం అరెస్ట్ చేస్తారంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు.‘‘సత్యేంద్రజైన్ అరెస్ట్ తర్వాత.. సెంట్రల్ ఏజెన్సీలు మనీష్ సిసోడియాను సైతం అరెస్ట్ చేయాలని అనుకుంటున్నట్టు మాకు విశ్వసనీయ సమాచారం ఉంది. మనీష్ సిసోసిడియాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని దర్యాప్తు ఏజెన్సీలను కేంద్రం కోరింది’’ అని కేజ్రీవాల్ తెలిపారు. ‘‘మీ సిసోడియా అవినీతి పరుడా? నేను 18 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అడగాలనుకుంటున్నాను’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘ఆప్ నేతలు అందరినీ అరెస్ట్ చేయండి మోదీజీ’ అని ఆయన అన్నారు. ‘‘నేను ప్రధాని మోదీని కోరేదేమిటంటే.. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్లి ఒకేసారి జైల్లో పడేయండి. అన్ని కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఒకేసారి దర్యాప్తు చేయాలి. మీకు కావాల్సినన్ని సార్లు దాడులు (సోదాలు) చేయండి. ఒకసారి ఒక మంత్రిని అరెస్ట్ చేయడం వల్ల పనులు నిలిచిపోతాయి. కొందరు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల వల్లే ఇదంతా అని అంటున్నారు. కొందరేమో పంజాబ్ ఎన్నికల ప్రతీకారంగా చెబుతున్నారు. ఏదైమైనా కానీయండి. అరెస్ట్లకు భయపడేది లేదు’’ అని కేజ్రీవాల్ కేంద్రంపై మండిపడ్డారు.