. మామిడి తోటల్ని పీడిస్తున్న తెగుళ్లు
. దిగుబడిరాక రైతన్నల దిగాలు
మామిడికి పుట్టినిల్లుగా పేరుగాంచిన ఉమ్మడి పశ్చిమ కృష్ణా జిల్లా (ఎన్టీఆర్ జిల్లా) పరిధిలోని తోటలు కనుమరుగయ్యేలా ఉన్నాయి. పూత, పిందెలు లేక మోడువారి కనిపిస్తున్నాయి. నోరూరించే బంగినపల్లి, తోతాపురి కాయలు కానరాకపోవడంతో ప్రజలు జిహ్వ చంపుకుని వెనుతిరుగుతున్నారు. ఎకరాకు ఆరు నుంచి ఏడు టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా అర టన్ను కూడా రాకపోవడంతో రైతన్నలు దిగాలు చెందుతున్నారు. నల్లిపురుగు, తేనెమంచు తెగుళ్లు రైతుల ఆశలను ఆవిరిచేశాయి. మామిడి పండ్లను ఆరగించేయవచ్చని ఎన్నో ఆశలుపెట్టుకున్న దేశ, విదేశీయులు సైతం నిరాశ చెందుతున్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే మామిడి పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
విశాలాంధ్ర – లింగపాలెం : మామిడికి ప్రసిద్ధిగాంచిన ఎన్టీఆర్ జిల్లా చింతలపూడి నియోజకవర్గం పరిధిలో మామిడి చెట్టుకు కాయలు కనిపించని పరిస్థితి నెలకొంది. సీజన్ వచ్చిందంటే దేశ, విదేశాలవారు సైతం ఈప్రాంతంలోని కాయలకు ఎగబడుతుంటారు. విమానాల్లో విదేశాలకు ఎగుమతి చేయడం రివాజు. కానీ ఈ ఏడాది ఇటువంటి పరిస్థితులు లేవు. ఈ ప్రాంత ప్రజలే కాయలు కోసం మరో ప్రాంతానికి వెళ్తున్నారు. మామిడికి పుట్టినిల్లుగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఇప్పుడు మామిడి తోటలు కనుమరుగయ్యేలా ఉంది. మామిడి తోటలను నమ్ముకున్న రైతులు దిగుబడులు లేకపోవటంతో కుదేలయ్యారు. చింతలపూడి, నూజివీడు నియోజకవర్గాల పరిధిలో 17 వేల మంది రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు. ఇక్కడ కాసే బంగినపల్లి, తోతాపురి, రసం కాయలకు మంచి డిమాండ్ ఉంది. దిగుబడులు లేకపోవడంతో ధర అమాంతంగా పెరిగిపోయింది. దీంతో దిగాలుచెందుతున్న మామిడి రైతులు… పుండు మీద కారం చల్లినట్టు ఉందని అంటున్నారు. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టిన దిగుబడి ఆశించిన రైతులకు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. తోతాపురి ఎకరాకు ఆరు నుంచి ఏడు టన్నులు, బంగినపల్లి నాలుగు టన్నులు దిగుబడులు రావాల్సి ఉండగా అరటన్ను కూడా రావడం లేదు. కొన్ని చెట్లకు కాపేలేదు. దీంతో మామిడి రైతులు కుమిలిపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మామిడికి పుట్టినిల్లుగా పేరుపొందిన ఈ ప్రాంతంలో మామిడి కనుమరుగవుతుందని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తేనెమంచు, నల్లిపురుగుతో దెబ్బతిన్న తోటలు
ఈ ఏడాది తేనెమంచు, నల్లిపురుగు మామిడి తోటలపై ప్రభావం చూపడంతో దిగుబడులు రాలేదు. వీటి బారి నుంచి తోటలను రక్షించుకోవటానికి రైతులు ఎంతగా కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. గతంలో నల్లిపురుగు మిర్చితోటలకే పరిమితం అయ్యేవి. ఈ ఏడాది మామిడి తోటలను ఆశించడం, దీనికి తేనెమంచు తోడుకావడంతో తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతులు కుదేలయ్యారు. దిగుబడిపై ఆశలు పెట్టుకున్న మామిడి రైతుల ఆశలు ఆవిరయ్యాయి.
పునరుద్దరణ పథకం ఎక్కడ?
మామిడి రైతులను ఆదుకోవటానికి పునరుద్దరణ పథకం ఎక్కడ అమలవుతుందనే విమర్శలు నెలకొన్నాయి. ఉద్యానశాఖ నుంచి మామిడి రైతులకు సబ్సిడీపై మందులు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రకృతి విపత్తు ఆధారిత బీమా పథకం అమలు చేయాలి. మామిడి తోటలను తెగుళ్ల నుంచి రక్షించటానికి శాస్త్రవేత్తల ద్వారా సలహాలు… అవగాహన కల్పించాలి. ఇష్టానుసారంగా పురుగు మందులు చల్లకుండా రైతులను చైతన్యపరచాల్సి ఉంది. ఇవేవీ జరగటంలేదని రైతులు విమర్శిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మామిడి పూర్తిగా అంతరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశ, విదేశీయుల నిరాశ
ఈ ప్రాంతంలో మామిడికాయల దిగుబడి లేకపోవటంతో దేశ, విదేశాల్లోని వారు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కాయల కోసం వచ్చిన వారంతా దిగాలుగా వెనుతిరిగి వెళ్తున్నారు. నాణ్యత, రుచిగా ఉండటం వల్ల మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ కాయలతో పచ్చళ్లు పడితే ఏడాది వరకు పాడవవని ప్రజలు అంటున్నారు.