. కాషాయపార్టీకి 400 సీట్లు కల: నారాయణ
. మోదీ బ్లాక్మెయిల్ రాజకీయాలు: రామకృష్ణ
. వైసీపీ, టీడీపీలకు దమ్ముంటే బీజేపీని మడత పెట్టండి: శ్రీనివాసరావు
. సీపీఐ, సీపీఎం రాష్ట్ర సదస్సుకు కాంగ్రెస్ సహా అనేక పార్టీల నేతలు
విశాలాంధ్ర – విజయవాడ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలుగు ప్రజలకు ప్రథమ శత్రువని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడిరచాలని ప్రజలకు వక్తలు పిలుపునిచ్చారు. మతోన్మాద బీజేపీ, దానికి మద్దతునిచ్చే టీడీపీ, జనసేన కూటమి, నిరంకుశ వైసీపీలకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం సంయుక్తంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సులో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ సదస్సుల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ స్వతంత్రంగా వ్యవహరించే వ్యవస్థీకృత రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. ఎన్నికల కమిషన్లో నాల్గవ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యారని చెప్పారు. మోదీని ప్రపంచ దేశాలు పొగిడినంత మాత్రన ఓట్లు రావని, దేశ ప్రజలు ఓట్లు వేయాల్సి ఉందన్నారు. 400 లోక్సభ సీట్లు సాధిస్తామని మోదీ కలగంటున్నారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల కంటే రైతుల ఆందోళనను అణచివేయడానికి ఎక్కువ బలగాలు మోహరించడం దారుణమన్నారు. విదేశాల్లో ఉన్న శిలలు, విగ్రహాలు తీసుకురావటం ముఖ్యం కాదని, రూ.10 లక్షల కోట్లు దోచుకొని విదేశాల్లో విలాసవంత జీవితం గడుపుతున్న అవినీతిపరులను వెనక్కి తీసుకురావాలని, దీంతోపాటు స్విస్బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును రప్పించాలని నారాయణ డిమాండ్ చేశారు. మోదీ ఆర్థిక ఉగ్రవాది, అమిత్ షా నేరస్తుడని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ విధానాలు ఒక్కటి కాదని వామపక్షాలు భావిస్తున్నట్లు చెప్పారు. వామపక్ష పార్టీలు ప్రజాతంత్ర, లౌకికశక్తులను కలుపుకుని బీజేపీని ఓడిరచటం ఖాయమన్నారు.
రామకృష్ణ సదస్సు ఉద్ధేశాన్ని వివరిస్తూ కేసులకు భయపడి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. పవన్కు జగన్ అంటే భయమని, అందుకే బీజేపీ పంచన చేరారని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల ముఖ్య నాయకులపై కేసులు బనాయించడం, బెయిల్ ఇప్పించటం, కేసులు పెండిరగ్లో పెట్టడం వంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. మోదీ ఓడిపోవాలని భావించే వ్యక్తులు, శక్తులు తమతో కలిసి రావాలని కోరారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం జగన్ చొక్కాలు మడతపెడతాం అంటే ప్రతిపక్షనేత కుర్చీలు మడత పెడతాం అంటూ సవాళ్లు విసురుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ, టీడీపీలకు బీజేపీని మడతపెట్టే దమ్ముధైర్యం లేక రాష్ట్రాన్ని మడతపెడుతున్నారని విమర్శించారు. వామపక్ష పార్టీల ప్రజాఉద్యమాలను చూసి వారు భయపడుతున్నారని చెప్పారు. రానున్న రోజులు ఎర్రజెండా పార్టీలవేనన్నారు. ఈ సందర్భÛంగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. రెండు శాతం పెట్టుబడిదారుల కోసం 98 శాతం ప్రజలను బాధపడుతున్నారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు, రైతులకు కనీస మద్దతు ధర, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చారు.
సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబుకు రైతుల కంటే పారిశ్రామికవేత్తలపైనే ప్రేమ ఎక్కువ అన్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లు ఇండియా కూటమికి ప్రజలు కట్టబెట్టాలని కోరారు. తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ నాయకులు బాలసింగం మాట్లాడుతూ 2024 ఎన్నికలను ప్రజాస్వామ్యం, మనువాద సిద్ధాంతాల మధ్య పోరుగా అభివర్ణించారు. ఒకే దేశం ఓకే ఎన్నికని చెపుతున్న మోదీ ప్రభుత్వం… ఒకే దేశం ఓకే కులం, ఒక్కడే దేవుడు అని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ, టీడీపీలకు సిద్ధాంతాలు లేవన్నారు. బీజేపీతో కలిసే ప్రాంతీయ పార్టీలు రానున్న రోజుల్లో అంతరించిపోతాయని స్పష్టం చేశారు.
జైభారత్ నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ. లక్ష్మీనారాయణ, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.మూర్తి, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల సుబ్రహ్మణ్యం, సమాజ్వాది పార్టీ నాయకులు పాశం వెంకటేశ్వరరావు, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు జె.అంజయ్య, తెలుగుసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సత్యారెడ్డి, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, ఎంసీపీఐ(యూ) నాయకులు ఖాదర్బాషా, నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, విశ్రాంత ఐఏఎస్ అధికారి బండ్ల శ్రీనివాస్, భారత్ బచావో నాయకులు సీహెచ్ భాస్కరరావు తదితరులు ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర సహాయకార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, జి.ఓబులేసు, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్ బాబూరావు, కె.ప్రభాకర్రెడ్డి, వి.ఉమామహేశ్వరరావు, మంతెన సీతారాం, డి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వి.శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీ వంగా ఆమోదించింది. సదస్సుకు హాజరైన అతిథులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ వందన సమర్పణ చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అధ్యక్షుడు చంద్ర నాయక్, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కోశాధికారి ఆర్.పిచ్చయ్య, నాయకులు ఎస్కే నజీర్, ఏపీ ప్రజానాట్య మండలి కార్యదర్శి అనిల్, నాయకులు అప్పన ఆలపించిన విప్లవ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.