భారత్లో లీడింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ గురించి వినే ఉంటారు. కొన్నేళ్ల కిందటి వరకు ఆయన వేల కోట్ల సంపదతో ఉండగా.. ఇటీవలి పరిస్థితుల కారణంగా సంపద పెద్ద మొత్తంలో పతనమైంది. ఆయనకు అప్పులు కూడా ఎక్కువ కాగా.. ఇప్పుడు ఏకంగా రవీంద్రన్ దగ్గర అసలేం సంపద లేనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన సంపద మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని ఫోర్బ్స్ లేటెస్ట్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా తెలిసింది. అంతకుముందు ఏడాది రవీంద్రన్ సంపద ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం 2.1 బిలియన్ డాలర్లుగా.. భారత కరెన్సీలో సుమారు రూ. 17,545 కోట్లుగా ఉండేది. అయితే ఇప్పుడు ఆయన సంపద జీరోగా చూయిస్తుంది. అత్యంత నాటకీయ పరిణామాల నడుమ బైజూస్ ఇటీవలి కాలంలో దివాలా తీసింది. ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత విలువైన ఎడ్ టెక్ సంస్థల్లో బైజూస్ ముందుండేది. ముఖ్యంగా కరోనా సమయంలో .. ఆన్లైన్ ఎడ్యుకేషన్కు విపరీతంగా డిమాండ్ ఉండగా.. బైజూస్ కూడా ఒక వెలుగు వెలిగింది. ఇదే క్రమంలో పెద్ద మొత్తంలో బ్రాంచులు, ట్యూషన్ సెంటర్లను తెరిచింది. ఇలా వ్యాపారాల్ని క్రమక్రమంగా అమెరికా సహా ఇతర దేశాలకు కూడా విస్తరించింది. వందల కొద్దీ ట్యూషన్ సెంటర్లను కూడా తెరిచారు. ఈ క్రమంలో విదేశీ నిధులకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన ఆరోపణలు వచ్చాయి. దీంతో మనీలాండరింగ్ కేసు నమోదైంది. బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు జరిపింది. మరోవైపు అప్పుల భారం ఎక్కువైంది. బిజినెస్ పడిపోయింది. నిధుల సమీకరణ కష్టమైంది. దీంతో ఒక దశలో నిర్వహణే కష్టమైంది.
మరోవైపు ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించలేదు. పీఎఫ్ బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగుల్ని కూడా పెద్ద మొత్తంలో తీసేసింది. బోర్డు సభ్యులు కూడా వరుసగా రాజీనామాలు చేశారు. బైజూస్ నుంచి రవీంద్రన్ను తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలా ఎన్నో సవాళ్ల నడుమ బైజూస్ వాల్యుయేషన్ కూడా ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇటీవల అది కేవలం 200 మిలియన్ డాలర్లకు తగ్గినట్లు తెలిసింది. ఇక ఇటీవల పదుల కొద్ది ట్యూషన్ సెంటర్లను కూడా మూసేసింది బైజూస్. ఇంకా బెంగళూరులోని తన ప్రధాన కార్యాలయం మినహా మిగతా ఆఫీసులన్నింటినీ మూసేసింది. గతేడాది లిస్ట్ నుంచి ఇప్పుడు కేవలం నలుగురు మాత్రమే బిలియనీర్ల జాబితా నుంచి వైదొలిగారని.. వారిలో ఒకరు బైజు రవీంద్రన్ అని ఫోర్బ్స్ ఈ సందర్భంగా వెల్లడించింది. మరోవైపు భారత్ నుంచి యంగెస్ట్ బిలియనీర్స్ జాబితాలో జెరోధా కోఫౌండర్లు నితిన్ కామత్, నిఖిల్ కామత్ సహా.. ఫ్లిప్కార్ట్కు చెందిన బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ చోటు సంపాదించారు.