. ఆందోళనలో గిరిజన ప్రజానీకం
. పట్టించుకోని అధికారులు
. ముందస్తు చర్యలు కరువు
విశాలాంధ్ర`అరకులోయ/పాడేరు (అల్లూరి జిల్లా) : ఎడతెరిపిలేని వర్షాలు… రోజుల తరబడి ముసురుతో అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం వాసులను వ్యాధుల భయం వెంటాడుతోంది. భారీ వర్షాలను లెక్కచేయకుండా తమ ముఖ్యమైన పనుల నిమిత్తం కుగ్రామాల నుంచి గిరిజనులు మండల కేంద్రాలకు తరలి వస్తున్నారు.ఈ ప్రక్రియలో నిత్యం వర్షానికి తడవడం మధ్యలో ఇబ్బందులు పడడం… పనులు ముగించుకు లేకపోవడం వంటి సంఘట నలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. యథావిధిగా మళ్లీ పనుల కోసం మండల కేంద్రానికి రావడం, వెళ్లడం జరుగుతోంది. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలడం సాధారణమే. అయితే గత 15 రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నప్పటికీ అధికారి యంత్రాంగం మాత్రం ఎటువంటి పారిశుధ్య చర్యలు చేపట్టడంలేదు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని వ్యాధులు ప్రబలకుండా గిరిప్రాంత ప్రజలను అప్రమత్తం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ అటువంటి కార్యక్రమాలు కాన రాకపోవడంపై గిరిజన ప్రాంత ప్రజలు, గిరిజన సంఘాల నేతలు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు మండిపడుతున్నారు. గతంలో సీజన్ ప్రారంభం కాకముందే గ్రామాల్లో వైద్య ఆరోగ్య సదస్సులు, వైద్య శిబిరాలు ముందస్తుగా నిర్వహించడం, కరపత్రాల ద్వారా గిరిజనులను చైతన్యవంతం చేసేవారు. మరగబెట్టిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షంలో తడవరాదని ఇలా అనేక జాగ్రత్తలను తెలుపుతూ అవగాహనతో కూడిన కార్యక్ర మాలు చేపట్టేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కడ అవగాహన కార్యక్ర మాలు చైతన్య సదస్సులు కనిపించడం లేదని వాపోతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో చాప కింద నీరుల జ్వరాలు విస్తరిస్తు న్నాయి. అవి ఎటువంటి జ్వరాలో తెలియక గిరిజనులు అయోమ యానికి గురి అవుతూ వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవలందడం లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత, ఏరియా ఆసుపత్రిలో వైద్యాధి కారుల కొరత ఉండడంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా గిరి ప్రజలు ఇబ్బందులు పడక తప్పడం లేదు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఎస్.కోట,విజయనగరం, విశాఖ పట్టణం వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పేద ప్రజానీకం మాత్రం విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్లే స్థోమత లేక రోగాన్ని ముదరబెట్టుకుంటూ ప్రాణంమీదకు తెచ్చుకుంటున్నారు. గత 15 రోజులుగా వర్షాలు కురుస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ ఏమాత్రం స్పందించకపోవడం, అధికార యంత్రాంగం కూడా మౌనంగా ఉండి పోవడంపై ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లా రావడంతో ఇక మంచి రోజులు వచ్చాయని, అరకులోయ అభివృద్ధి ప్రగతి పథంలో ప్రయా ణిస్తుందని అందరూ ఎదురు చూశారు. అయితే అందుకు విరుద్ధంగా జిల్లా ఏర్పడి ఇన్ని నెలలు కావస్తున్నా.. పాత సమస్యలు అట్లనే ఉండ టంతో జిల్లా వచ్చి ప్రయోజనం ఏంటని గిరిజనం ప్రశ్నిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో వ్యాధులు విజృంభించక ముందే, మరో మరణ మృదంగం మోగకముందే అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గిరిజన సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పంచాయతీ కేంద్రాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.