. అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస
. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
. ఆటపాటలతో ఉత్సాహం నింపిన ప్రజా యుద్ధనౌక
. ప్రజా గాయకుడి భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు
. నేడు అంత్యక్రియలు
విశాలాంధ్ర – హైదరాబాద్ : ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్రావు (74) తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మరణించినట్లు కుమారుడు సూర్యం వెల్లడిరచారు. గద్దర్ తీవ్రమైన గుండె వ్యాధితో జులై 20న ఆస్పత్రిలో చేరారు. ఆగస్టు 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. ఆ వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తుల సమస్య రావడంతో మరణించారు. గతంలో కూడా ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన ఇబ్బంది పడ్డారు. ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలు, వయసు సంబంధిత కారణాలతో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గద్దర్ కన్నుమూశారని అపోలో వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు కుటుంబీకులు కూడా ప్రకటన చేశారు. ఆదివారం ఉదయం బీపీ పెరగడంతో పాటు షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయని గద్దర్ కుటుంబీకులు మీడియాకు వెల్లడిరచారు. గద్దర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
ప్రజాయుద్ధ నౌకగా పేరు తెచ్చుకున్న గద్దర్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో గద్దర్ దళిత కుటుంబంలో జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రి పేరు శేషయ్య. నిజామాబాద్ జిల్లా మహబూబ్నగర్లో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరురా తిరిగి ప్రచారం చేసేందుకు ఆయన బుర్రకథను మార్గంగా ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ‘ఆపర రిక్షా’ పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడిరది. మాభూమి చిత్రంలో ‘బండెనక బండికట్టి’ పాటపాడి నటించారు. 1997లో గద్దర్పై హత్యాయత్నం జరిగింది. చాలాకాలం శరీరంలో తూటాతోనే జీవించిన గద్దర్ తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపుతెచ్చారు. ప్రజా గాయకుడిగా గుర్తింపు పొందారు. తన పాటలతో దాదాపు 50 ఏళ్లుగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. తెలంగాణ యాసలో ఆయన పాడిన పాటలు ఎందరినో ఉర్రూతలూగించాయి. తెలంగాణ ఉద్యమం రెండవ దశలో గద్దర్ రాసిన పాటల్లో ‘అమ్మ తెలంగాణమా’ అనే పాట తెలంగాణ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ‘జై బోలో తెలంగాణా’ సినిమాలో తెరపై కూడా ఆయన కనిపించారు. ‘పొడుస్తున్న పొద్దూ’ మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో గొప్ప ప్రాచుర్యం పొందింది. అలాగే ‘నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ’ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు కూడా దక్కింది. అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. నన్ను గన్న తల్లులారా, అడవి తల్లి బిడ్డలారా, అమ్మ తెలంగాణ మా ఆకలి కేకల గానమా, మల్లె తీగకు పందిరి వోలె, మస్క చీకటిలో వెన్నెల వోలె చెల్లెమ్మ అంటూ ఆయన పాడిన పాటలు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. గద్దర్ మరణంతో ఆయన ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. తెలంగాణ ప్రజానీకం, విప్లవకారులు, ఉద్యమకారులు, రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా గద్దర్కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
గద్దర్ మరణం బాధాకరం: నారాయణ
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రగాఢ సంతాపం తెలిపారు. గద్దర్కు, తనకు ఎంతో సన్నిహిత సంబంధం ఉందని అన్నారు. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్, తాను కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించామని, ఆ ప్రాంత బొగ్గు కార్మిక ప్రాంతాలకూ వెళ్లామని గుర్తు చేశారు. గద్దర్ విప్లవ పోరాటంలో ప్రముఖమైన పాత్ర పోషించారని, వామపక్ష ప్రజాస్వామ్య ఉద్యమాల్లో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన తలమానికంగా ఉన్నారని కొనియాడారు. పొడుస్తున్న పొద్దుమీద… నడుస్తున్న కాలమా… అనే గేయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోమోగిందన్నారు. అలాంటి ఉత్తేజకరమైన నాయకుడు గద్దర్ హఠాన్మరణం చాలా బాధాకరమని, వారి మరణం పట్ల సీపీఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ను రాష్ట్ర ప్రముఖుడిగా గుర్తించి, ఆయన పేరిట ఒక స్మారక సంస్థ ఏర్పాటు చేసి, గద్దర్ సేవలను చిరకాలం గుర్తుండేలా చర్యలు తీసుకోవాలని నారాయణ సూచించారు.
పాటలతో జనచైతన్యం గావించిన గద్దర్ : రామకృష్ణ
ప్రజా గాయకుడు గద్దర్ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజా సమస్యలపై జరిగే పోరులో గద్దర్ ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు తనదైన శైలిలో పాటలు రచించి, పాడి జన చైతన్యం గావించేవారన్నారు. తెలుగు సాంస్కృతిక రంగంలో గద్దర్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. గద్దర్ మరణం పట్ల సీపీఐ రాష్ట్ర సమితి తరపున ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ఏపీ, తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, వల్లూరి శివప్రసాద్, ఆర్వీ రామారావు, రాపోలు భాస్కర్ సంతాపం తెలిపారు.
గద్దర్ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ప్రజా గాయకుడు గద్దర్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ అని, ఆయన పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటేనని, నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారని కొనియాడారు. ఆయన మరణం ఊహించనిదన్నారు. సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయన్నారు. గద్దర్కు తెలుగు జాతి సెల్యూట్ చేస్తోందని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందామన్నారు. గద్దర్ మరణంపై రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో ప్రజాగానం మూగబోయిందన్నారు. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు జీవితాంతం అండగా నిలిచిన మహనీయుడు గద్దర్ అని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు.
సీఎం కేసీఆర్, రాహుల్ నివాళి
గద్దర్ మరణించిన విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి వారు సంతాపం వ్యక్తం చేశారు.
అలాగే విషయం తెలిసిన వెంటనే అపోలో ఆస్పత్రికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకున్నారు. గద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, సీతక్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వీహెచ్ తదితరులు ఉన్నారు.