. విపక్షాలపై విమర్శలకే ప్రధాని పరిమితం
. 90 నిముషాలు గడిచినా వినిపించని ‘మణిపూర్’
. ప్రతిపక్షాల తీవ్ర అసహనం – వాకౌట్
న్యూదిల్లీ : మణిపూర్లో అల్లర్లపై ప్రధాని మౌనం వీడాలన్న పట్టుదలతో పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రధాని మోదీ సమాధానం కోసం వేచివున్న ప్రతిపక్షాలకు నిరాశే ఎదురైంది. మోదీ రాజకీయ ప్రసంగం చేయడం, మొదటి 90 నిమిషాల వరకు కనీసం మణిపూర్ పేరును ప్రస్తావించకపోవడం విపక్షాలకు కోపం తెప్పించింది. సభను, భారత్ను, మణిపూర్ ప్రజలను అవమానించిన తీరుకు నిరసనగా వారంతా వాకౌట్ చేశారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినప్పటికీ మోదీ మౌనదీక్షను భగ్నం చేయగలిగామని ప్రతిపక్షాలు సంతృప్తి చెందాయిగానీ మణిపూర్కు న్యాయం జరగాలన్న ఉద్దేశం నెరవేరలేదని తెలిపాయి. మణిపూర్ అంశం మీద దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని ప్రధానిని కోరితే ఆయన రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారని పార్టీలు అసహనం వ్యక్తంచేశాయి. మాట్లాడటం మొదలు పెట్టిన 90 నిముషాల వరకు మణిపూర్ పేరు కూడా ఎత్తలేదని కేవలం కాంగ్రెస్ను తిట్టడం, ప్రతిపక్షాలను అవమానించడం, విమర్శించడానికే పరిమితమయ్యారని దుయ్యబట్టాయి. అవిశ్వాస తీర్మానంలో లేవనెత్తిన ఏ ఒక్క అంశానికి ప్రధాని నుంచి సమాధానం రాలేదని కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలోని పార్టీలు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశాయి. ‘రాజకీయ ప్రసంగం మాత్రమే చేశారు. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టామో దాని ఉద్దేశం నెరవేరలేదు’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. మణిపూర్ ప్రజలకు న్యాయం జరగడం, మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడాలనే ఉద్దేశంతో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. చాలా కాలం తర్వాత ప్రధాని సభకు వచ్చారు. ఆయన మౌనదీక్షను భగ్నం చేయగలిగాం. కానీ మణిపూర్కు సంబంధించినంత వరకు మా ఉద్దేశం నెరవేరలేదు. తన బాధ్యతల నుంచి ప్రధాని తప్పించుకుంటున్నారు’ అని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ్గొగోయ్ అన్నారు. డీఎంకే నేత టీఆర్ బాలు మాట్లాడుతూ అనేకసార్లు జోక్యం చేసుకున్నాగానీ ప్రధాని స్పందించలేదు. మణిపూర్కు న్యాయంపై మాటైనా మాట్లాడలేదని చెప్పారు. కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం స్పందిస్తూ తన ప్రభుత్వం ఏం చేసిందో, చేయాలని అనుకుంటుందో ఊదరగొట్టారేగానీ మొదటి 90 నిమిషాల ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావనే రాలేదన్నారు. మోదీ తీరుపై ఆగ్రహంతో సభ నుంచి వెళ్లిపోయామని విపక్ష నేతలు చెప్పారు.
కాగా, సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్తో ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారన్న స్పష్టత కూడా విపక్షానికి లోపించిందని విమర్శించారు. తొలుత 2018లో మళ్లీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారుగానీ దానిపై సంసిద్ధంగా ఉంటారన్న నమ్మకాన్ని వమ్ముచేశారని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి, సమగ్ర కోసం చట్టసభలు జరగాలని, వ్యక్తులు కాదు దేశానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మోదీ అన్నారు. నేటి భారతం ఒత్తిళ్లకు తలొగ్గబోదని ఉద్ఘాటించారు. కాలం మారిందని చెప్పిన ఆయన దేశానికి నూతన ఆర్థిక వ్యవస్థలుగా ఈశాన్య రాష్ట్రాలు అవతరలిస్తున్నట్లు తెలిపారు. ‘కీలక బిల్లులను సభలో ఆమోదించినా కానీ ఆ బిల్లులపై విపక్షాలకు ఆసక్తి లేదు. దేశ ప్రజలపై విపక్షాలు విశ్వాస ఘాతుకానికి ఒడిగట్టాయి. పేదల గురించి ఆలోచన లేదు.. అధికారంలోకి రావడమే వారి పరమావధి. అవిశ్వాసం పెట్టి అభాసుపాల య్యాయి. క్రికెట్ భాషలో చెప్పాలంటే వరుస నోబాల్స్ వేస్తున్నాయి. అధికారపక్షం ఫోర్లు, సిక్సులు కొడుతోంది. విపక్షాలు మాట్లాడిన ప్రతి మాట దేశమంతా శ్రద్ధగా వింటోంది. ఇప్పటివరకు మీరు (విపక్షాలు) నిరాశ, నిస్పృహల్లో ముంచడం తప్ప దేశానికి చేసిందేమీ లేదు. వారు తీసుకున్న గోతిలో వారే పడుతున్నారు. 1999లో శరద్ పవార్ నాయకత్వంలో, 2003లో సోనియా నేతృత్వంలో అవిశ్వాసం పెట్టారు. 2018లో మళ్లీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఏంసాధించారు. అసలు మీ సమస్య ఏమిటి…’ అని మోదీ వ్యాఖ్యానించారు. మణిపూర్లో శాంతి నెలకొంటుందని సభకు హామీ ఇస్తున్నాని ప్రధాని అన్నారు. మణిపూర్పై సంపూర్ణ చర్చ జరగాలనే ఆలోచన విపక్షాలకు లేదన్నారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అందరం కలిసి ఒక నిర్ణయానికి రావాలనే ఆలోచన విపక్షాలకు లేదు. మణిపూర్ ప్రజలపై ప్రేమకన్నా.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఆలోచన వారకి ఎక్కువని విమర్శించారు. మణిపూర్లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి.. ప్రజల మధ్య విశ్వాసం నశించింది. మహిళలకు ఘోర అవమానం జరిగింది.. అది మనందరికీ తలవంపే’ అని మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇష్టానుసారం ప్రభుత్వాలను, సీఎంలను మార్చడం అనేక సమస్యలను దారితీస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ చేసిన కుటిర రాజకీయాలే ఈశాన్య రాష్ట్రాల్లో నిరంతర సమస్యలకు కారణమయ్యాయని విమర్శించారు.
ఒకసారి భారతమాత హత్య అంటారు.. మరోసారి రాజ్యాంగం హత్య అంటారు.. ఎలాంటి భాష ఇది? బుజ్జగింపు విధానాలతోనే దేశానికి ముప్పు. ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపుర్ ప్రజలకు అండగా నిలుస్తుంది’ అని ప్రధాని చెప్పారు. కాంగ్రెస్ కష్టాలు చూసి జాలి వేస్తోందని, పనికిరాని వస్తువును ఎన్నిసార్లు ప్రవేశపెట్టినా ప్రజలు పట్టించుకోరంటూ రాహుల్నుద్దేశించి మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. రాజకుమారుడు కారు అద్దం దించి దేశ సమస్యలు ఇప్పుడిప్పుడే చూస్తున్నారని విమర్శించారు. ఇండియా కూటమిని అహంకారపూరిత సంకీర్ణమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని ఈ సంకీర్ణం చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.