ఓబులేసు, మల్లికార్జునరెడ్డి డిమాండ్
విశాలాంధ్ర-విజయవాడ(చిట్టినగర్): అవినీతి రహిత సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందని, అందులో భాగంగా నియమించిన జేఎల్ఎం గ్రేడ్`2 ఉద్యోగులను సచివాలయాలకే అప్పజెప్పి…సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయం ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.ఓబులేసు, రాష్ట్ర అధ్యక్షుడు కె.మల్లికార్జునరెడ్డి డిమాండ్ చేశారు. గ్రామ, వార్డు సచివాలయం ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్వర్యంలో ఆదివారం విజయవాడ టీచర్స్ కాలనీలో సాయి జ్యువలర్స్ కన్వెన్షన్లో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఓబులేసు, మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఎనర్జీ సెక్రెటరీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా జేఎల్ఎం గ్రేడ్-2లు సంఘటితమయ్యారని, ఇది శుభపరిణామమన్నారు. సచివాలయం వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ మధ్య నలిగిపోతూ మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. సచివాలయ వ్యవస్థ ఏర్పడిన మూడేళ్ల 8 నెలల కాలంలో 130 మందికి పైగా విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయారని, మరో 300 మందికి పైగా శరీర భాగాలు కోల్పోయారని చెప్పారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించి…సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటే…జేఎల్ఎం గ్రేడ్-2లు మాత్రం సెలవు అనే మాటే లేకుండా 24 గంటలు పనిచేయాల్సి వస్తోందని ఆరోపించారు. వారికి సచివాలయ ఉద్యోగుల తరహాలో మూలవేతనం మాత్రమే చెల్లిస్తున్నారని, విద్యుత్ సంస్థలు ఇతర అలవెన్స్లు చెల్లించటం లేదని తెలిపారు. జేఎల్ఎం గ్రేడ్-2 లు 2019 అక్టోబర్ 2న సచివాలయానికి అనుబంధంగా నియమించారన్నారు. నూతన సర్వీస్ రూల్స్తో తక్కువ వేతనాలతో ఎక్కువ పని చేయటమే కాకుండా ఇతర అలవెన్స్లు కూడా కోల్పోతున్నారన్నారు. ఐదేళ్లకు ఒక ప్రమోషన్ ఇచ్చి అన్యాయానికి గురిచేస్తున్నారని, ఈ సర్వీస్ రూల్స్ని వెంటనే రద్దు చేయాలని ఓబులేసు, మల్లికార్జునరెడ్డి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజునాథ్ మాట్లాడుతూ జేఎల్ఎం గ్రేడ్-2 లను సచివాలయ ఉద్యోగులుగా గుర్తించి 010 ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని, సచివాలయం జాబ్ చార్ట్ ప్రకారమే విధులు నిర్వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. జేఎల్ఎం గ్రేడ్-2 ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిం చకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోశాధికారి సుధీర్బాబు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, రాష్ట్ర నాయకులు కృపాకర్, రహీమ్, అంబేద్కర్, రామకృష్ణ, నూరుల్లా, సురేశ్, అన్వర్, త్రిపురాం తకం శ్రీనివాసులు, బిల్లు శ్రీనివాసులు, నాగరాజు, రవీంద్ర, దాదు, కటిక రమేశ్, వెంకటేశ్ నాయక్, హేముకుమార్ తదితరులు పాల్గొన్నారు.