ఆరో దశలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని ఏడు లోక్సభ నియోజకవర్గాలకు రేపే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను బీజేపీ, ఆప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజార్టీ స్థానాలను గెలిచేందుకు ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీనే గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనూ కూడా అన్ని స్థానాల్లో గెలుపొందాలని బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఆప్ కూడా అదే స్థాయిలో పోరాటం చేస్తోంది. అయితే ఇండియా కూటమిలో భాగంగా ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తుంది. ఏడు లోక్సభ స్థానాలకు గానూ 162 మంది బరిలో ఉన్నారు. అత్యధికంగా నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ రెండు ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సీఎంలు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామీ, ప్రమోద్ సావంత్ ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరపున ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్తో పాటు పలువురు సీనియర్లు ప్రచారం నిర్వహించారు. మధ్యంతర బెయిల్పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రోడ్ షోలు నిర్వహించారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆప్ సీనియర్లు అతిషి, సౌరభ్ భరద్వాజ్, సంజయ్ సింగ్, గోపాల్ రాయ్ బహిరంగ సభలు నిర్వహించి, ఆప్కు ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కన్హయ్య కుమార్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. రెండు సార్లు ఎంపీగా గెలుపొందిన బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీపై కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ కూడా బీహార్కు చెందిన వారే కావడం విశేషం. ఇక గత ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఎంపీల్లో మనోజ్ తివారీకి మాత్రమే మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కింది. ఈస్ట్ ఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ పోటీ చేయడం లేదు. ఆయన స్థానంలో హర్ష్ మల్హోత్రా పోటీ చేస్తున్నారు. ఆప్ తరపున కుల్దీప్ కుమార్ బరిలో ఉన్నారు.