ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈరోజు కవితది కస్టడీ చివరి రోజు కాగా.. హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు మొదలుపెట్టింది. కవిత బంధువుల ఇళ్లతో పాటు.. ఆమె భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లో ఉన్న కవిత ఆడపడుచు అఖిల ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే అఖిల నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి 15న హైదరాబాద్లోని కవిత ఇంట్లో ముమ్ముర సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ లావాదేవీలు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. విచారణకు రావాలని కూడా నోటీసులివ్వగా.. ఆయన వెళ్లలేదు. అయితే.. ఇప్పుడు కవిత కస్టడీ చివరి రోజున ఇలా.. తమ బంధువుల ఇళ్లలో ముమ్మర తనిఖీలు చేయటం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. అయితే.. కవిత నుంచి ఇప్పటికే సుమారు 16 మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె భర్త అనిల్తో పాటు పీఆర్వో రాజేష్, ముగ్గురు అసిస్టెంట్ల ఫోన్లను కూడా అధికారులు సీజ్ చేశారు. కాగా.. కస్టడీ రిపోర్టులోనూ సంచలన విషయాలు వెల్లడించింది ఈడీ. కాగా.. ఈరోజు కస్టడీ ముగుస్తుండటంతో.. మధ్యాహ్నం 12 రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చాల్సి ఉండగా.. కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందన్నది ఉత్కంఠగా మారింది.