. రాజకీయం కోసం ఇక్కడకు రాలేదు
. శాంతియుతంగా పరిష్కరిద్దాం
. మణిపూర్ సంక్షోభంపై ‘ఇండియా’ కూటమి ఎంపీలు
. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన ప్రారంభం
. సహాయక శిబిరాల్లో బాధితులను కలిసిన విపక్ష నేతలు
. నేడు గవర్నర్తో భేటీ
ఇంఫాల్ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ఎంపీల బృందం శనివారం మణిపూర్లోని అల్లర్లకు గురైన చురాచంద్పూర్ పట్టణాన్ని సందర్శించింది. అక్కడ వారు సహాయక శిబిరాల్లో ఉన్న జాతి కలహాల బాధితులతో పాటు కుకీ వర్గం నాయకులు, పౌర సమాజ సభ్యులను కలిసింది. మణిపూర్లో జాతి వివాదాలు భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, అన్ని పార్టీలు శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలని ఎంపీ బృందం పిలుపునిచ్చింది. కేంద్రం ఇప్పటి వరకు నిద్రపోతోందా అని ప్రశ్నించింది. ప్రతినిధి బృందం ఆదివారం రాష్ట్ర గవర్నర్ను కలవనున్నది. జాతి కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్లో పరిస్థితిని అంచనా వేయడానికి ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు చెందిన 21 మంది ఎంపీల బృందం ఇంఫాల్కు చేరుకుంది. రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన ఈ బృందం బాధితులను పరామర్శించేందుకు అనేక సహాయక శిబిరాలను సందర్శించింది. అనంతరం కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ ‘వారు సీబీఐ (జరిగిన నేరాలపై) దర్యాప్తు గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నిద్రపోతుందా అని ప్రశ్నిస్తున్నాను. జాతి ఘర్షణల బాధితులను కలవడానికి, సమస్యను అర్థం చేసుకోవడానికి మేము ఇక్కడకు వచ్చాం. హింసను త్వరగా ముగించాలని, శాంతిని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. మణిపూర్లో ఏమి జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తోంది’ అని తెలిపారు. ‘జాతి ఘర్షణలు మణిపూర్, ఈశాన్య ప్రాంతం, మొత్తం భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. శాంతియుత పరిష్కారం కోసం మనమందరం ప్రయత్నించాలి. మేము ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేదు’ అని ఆయన అన్నారు. దిల్లీ నుంచి వాణిజ్య విమానంలో ఎంపీలు ఇంఫాల్ చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతినిధి బృందం తాజాగా హింస చోటుచేసుకున్న చురాచంద్పూర్కు వెళ్లింది. అక్కడ సహాయక శిబిరాల్లో ఉన్న కుకీ వర్గానికి చెందిన బాధితులను కలిసింది. ‘ఇంఫాల్ నుంచి భద్రతా సమస్యల కారణంగా చురాచంద్పూర్కు హెలికాప్టర్లో వెళ్లింది. అయితే ఒక హెలికాప్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నందున ప్రతినిధి బృందంలోని సభ్యులను రెండు బృందాలుగా విభజించారు. వారిని తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్ రెండు ట్రిప్పులు నడిచింది’ అని భద్రతా అధికారి పీటీఐకి చెప్పారు. లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, ఇతరులతో కూడిన ఒక బృందం చురాచంద్పూర్ కళాశాలలోని బాలుర హాస్టల్లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాన్ని సందర్శించడానికి బయలుదేరింది. లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్, ఇతరులతో కూడిన మరో బృందం చురాచంద్పూర్లోని డాన్ బాస్కో స్కూల్లోని సహాయ శిబిరాన్ని సందర్శించడానికి వెళ్లిందని మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ (ఎంపీసీసీ) వర్గాలు తెలిపాయి. ‘ఇంఫాల్కు తిరిగి వచ్చిన తర్వాత చౌదరి నేతృత్వంలోని బృందం బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్ కళాశాల వద్ద ఉన్న మరో సహాయ శిబిరానికి రోడ్డు మార్గంలో మైతేయి వర్గానికి చెందిన బాధితులను కలవడానికి వెళుతుంది’ అని ఆయన చెప్పారు. ఇతర ప్రతిపక్ష ఎంపీల బృందం ఇంఫాల్ తూర్పు జిల్లాలోని అకంపట్లోని ఆదర్శ బాలికల కళాశాల సహాయ శిబిరానికి వెళ్లి ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లంబోయిఖోంగాంగ్ఖాంగ్లోని మరొక శిబిరాన్ని సందర్శిస్తుంది. కాగా, మణిపూర్ సమస్యను రాజకీయం చేస్తున్నారనే బీజేపీ ఆరోపణలపై గొగోయ్ను ప్రశ్నించగా, ‘ప్రధాని నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందంలో భాగమైనందుకు మేము చాలా సంతోషించాము. కానీ ఆయన దాని నుంచి పూర్తిగా తప్పిపోయాడు. పార్లమెంటులో మణిపూర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎన్డీఏ సీన్ నుంచి పూర్తిగా తప్పిపోయింది. కానీ ‘ఇండియా’ ఉంది. ‘ఇండియా’ మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుంది. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి మేము అన్ని విధాలుగా చేస్తాము’ అని పీటీఐకి చెప్పారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ, ప్రతినిధి బృందంలో భాగమైన కె.సురేష్, కేంద్రం, మణిపూర్ ప్రభుత్వం పరిస్థితిని ‘అధ్వానంగా’ నిర్వహించాయని ఆరోపించారు. ‘రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడానికి, హింసాకాండ బాధితులను కలవడానికి మేము ఇక్కడకు వచ్చాము. మేము దిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత పార్లమెంటులో మా పరిశీలనల ఆధారంగా వివిధ సమస్యలను లేవనెత్తుతాము. అటువంటి సమస్యలపై కేంద్రం దృష్టిని కోరతాం’ అని ఆయన చెప్పారు. బీజేపీ విభజనకు పాల్పడుతోందని, పోరాడుతున్న రెండు వర్గాలలో ఒకదానికి మద్దతు ఇస్తోందని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. రాష్ట్రంలో తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు బీజేపీ సృష్టించిన సమస్య అని, కులం, మతం, భాషల ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆర్జేడీ నాయకుడు మనోజ్ కుమార్ రaా మాట్లాడుతూ ‘ఈ అందమైన రాష్ట్రంలో ప్రజలు గత మూడు నెలలుగా కష్టాలు పడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు తప్ప వారి బాధలను వినడానికి ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదు. ఈ రోజు మనం ఏమీ చెప్పడానికి కాదు. వారి మాటలు వినడానికి మాత్రమే వచ్చాము. వారి బాధను అనుభవించండి. అందుకే మేము ఇక్కడ ఉన్నాము’ అని తెలిపారు. ప్రతిపక్ష కూటమికి చెందిన ‘ఇండియా’ ఎంపీలు రెండు వర్గాల ప్రజల వాణిని వింటారని డీఎంకే నాయకురాలు కనిమొళి అన్నారు. ‘వారు బాధలో ఉన్నారు. వారి సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. మేము సహాయ శిబిరాలను సందర్శించినప్పుడు కనుగొన్న విషయాలతో ఆదివారం ఉదయం గవర్నర్ను కలుసుకుని సమస్యలపై చర్చిస్తాము. మేము మా ఫలితాలను దిల్లీకి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకుంటాము. తదనుగుణంగా భవిష్యత్ వ్యూహాలు ఉంటాయి’ అని డీఎంకే ఎంపీ చెప్పారు. పార్లమెంటులో మణిపూర్ అంశంపై ప్రధాని మౌనంగా ఉన్నారని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ అరవింద్ సావంత్ ఆరోపించారు. టీఎంసీ నాయకురాలు సుస్మితా దేవ్ మాట్లాడుతూ బృందం ఇరు వర్గాల ప్రతినిధులతో మాట్లాడుతుందని చెప్పారు. ‘ప్రతి ఒక్కరి గొంతు తప్పక వినబడుతుంది. మేము కుకీలు, మైతేయిలు ఇద్దరితో మాట్లాడతాం’ అని అన్నారు. ఆదివారం ఉదయం, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధి బృందం ఇక్కడ రాజ్భవన్లో గవర్నర్ అనుసూయా ఉయికేతో సమావేశమై కొనసాగుతున్న పరిస్థితి, మణిపూర్లో శాంతిని నెలకొల్పడానికి సాధ్యమయ్యే చర్యలపై చర్చిస్తుందని ఎంపీసీసీ నాయకుడు ఒకరు తెలిపారు. కాగా, ఈ బృందం ఆదివారం మధ్యాహ్నం దేశ రాజధానికి తిరిగి రానుంది. పర్యటనకు ముందు, మణిపూర్లో రెండు వర్గాల మధ్య జరుగుతున్న జాతి ఘర్షణలపై సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని గొగోయ్ పిలుపునిచ్చారు. చౌదరి, గొగోయ్తో పాటు టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్, జేఎంఎంకు చెందిన మహువా మరిa, డీఎంకేకు చెందిన కనిమొళి, ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి, ఆర్జేడీకి చెందిన మనోజ్ కుమార్ రaా, ఆర్ఎస్పీకి చెందిన ఎన్.కె.ప్రేమచంద్రన్, జేడీ(యూ) నాయకుడు రాజీవ్ ప్రసాద్ సింగ్ (లాలన్), అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నుంచి పి.సందోశ్ కుమార్, సీపీఎం నుంచి ఎ.ఎ.రహీమ్ తదితరులు ఉన్నారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి సామాజిక వర్గానికి చెందిన డిమాండ్కు నిరసనగా కొండ జిల్లాల్లో ‘ఆదివాసి సంఫీుభావ యాత్ర’ నిర్వహించిన తర్వాత మే 3న మణిపూర్లో జాతి ఘర్షణలు చెలరేగడంతో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. మణిపూర్ జనాభాలో మైతేయిలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులైన నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. వీరు కొండ ప్రాంత జిల్లాల్లో ఎక్కువ నివసిస్తున్నారు.