భానుడు సెగలు కక్కుతుండడంతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసుకొచ్చింది. రేపటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలతోపాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడతాయంటూ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నప్పటికీ హైదరాబాద్ వాసులకు మాత్రం నిరాశే. భాగ్యనగరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదని పేర్కొంది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉష్ణోగ్రతలు రెండుమూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. నేడు పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.