ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బ్యాడ్ లక్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా కవిత అరెస్టయి రెండు నెలలు కావొస్తున్నా.. ఇప్పటికీ బెయిల్ దొరకలేదు. పైగా.. మరోసారి కవిత జ్యుడీషియల్ రిమాండ్ను న్యాయస్థానం పొడిగించింది. అయితే.. నేటితో కవిత కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో.. ఆమెను వర్చువల్గా ధర్మాసనం ముందు హాజరుపరిచారు. కాగా.. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి 8 వేల పేజీల సప్లింమెంటరీ ఛార్జ్షీట్ను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. కవిత జ్యుడీషియల్ రిమాండ్ను మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కవిత ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకోవడంపై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మే 20కి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఇప్పటికే రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 6న కొట్టివేస్తూ, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కవితదే కీలక పాత్ర అని.. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసి.. ఆధారాలను తారమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా.. ఆమెపై ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్లో.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన సూత్రధారి, పాత్రధారి కవితేనని.. ఈడీ అధికారులు పేర్కొన్నారు. కవితతో పాటు మరోనలుగురిపై ఈడీ అధికారులు ఛార్జిషీట్లు దాఖలు చేశారు కూడా.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో కవిత అరెస్టయి రేపటికి అంటే మే 15వ తేదీకి రెండు నెలలు పూర్తి కానున్నాయి. కాగా.. ఇప్పటికీ ఆమెకు బెయిల్ దొరకటం కష్టంగా మారింది. పైగా.. ప్రతిసారి జ్యుడీషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. అయితే.. ఇదే కేసులో ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా ఇప్పటివరకు బెయిల్ రాకపోవటం గమనార్హం. కవితకు కూడా ఇదే పరిస్థితి ఎదురవనుందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు.. ఎన్నికలు పూర్తయ్యే వరకు కవితకు బెయిల్ దొరికే పరిస్థితి లేదని.. ఫలితాలు వెల్లడయ్యాక వచ్చే అవకాశాలు లేకపోలేదంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. కవిత తండ్రి, బీఆర్ఎస్ అధినేత మాత్రం తన కూతురు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.