మణిపూర్ హింసాకాండలో మరణించిన 35 మంది వ్యక్తులకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించిన చురచంద్పూర్ జిల్లా హవోలై ఖోపి గ్రామంలోని ప్రతిపాదిత ఖనన స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని మణిపూర్ హైకోర్టు గురువారం ఆదేశించింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు అత్యవసర విచారణ జరిపిన అనంతరం మణిపూర్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ ఎం.వి. మురళీధరన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ప్రతిపాదిత ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ అంశంపై ప్రభుత్వాలతో సహా అన్ని పక్షాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. వారం రోజుల్లోపు భూమిని కేటాయించాలని అధికారులను కోరవచ్చని కుకీ కమ్యూనిటీకి స్వేచ్ఛను ఇచ్చింది.