పార్లమెంటులో ప్రధాని మాట్లాడాలని ఆదేశించండి
. శాంతి పునరుద్ధరణకు రోడ్మ్యాప్ ఇవ్వండి
. ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయండి
. రాష్ట్రపతి ముర్మును కలిసిన విపక్ష ‘ఇండియా’ కూటమి బృందం
న్యూదిల్లీ : మణిపూర్ సమస్యపై పార్లమెంటులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలన్న తమ డిమాండ్పై ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు చెందిన ఎంపీలు సహా నాయకులు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతిపత్రం సమర్పించారు. మణిపూర్లో రగులుతున్న మంటలు ఆపేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను జాబితా చేయాలని కోరారు. రాష్ట్రాన్ని ప్రధాని మోదీ సందర్శించి, హింసను అంతం చేసి సోదరభావాన్ని పెంపొందించేందుకు పోరాడుతున్న వర్గాలకు విజ్ఞప్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. మణిపూర్ నుంచి ఇద్దరు మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని ‘ఇండియా’ కూటమి సభ్యులు రాష్ట్రపతి ముర్ముకు విజ్ఞప్తి చేశారు. ఈ చర్య రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులను సరిదిద్దేందుకు సహాయపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో ప్రతిపక్ష కూటమికి చెందిన 31 మంది నాయకులు హరియాణాలోని నుప్ాలో మత ఉద్రిక్తత అంశాన్ని లేవనెత్తారు. ‘ప్రధాన మంత్రి కార్యాలయానికి కేవలం 100 కిమీ దూరంలో’ జరుగుతున్న పరిణామాల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాను ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ ఇటీవల మణిపూర్లో పర్యటించిన ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర పరిస్థితిని రాష్ట్రపతికి తెలియజేసి, ప్రభావిత ప్రాంతాల్లో చూసిన వాటిని పంచుకున్నట్లు చెప్పారు. కూటమిలోని 31 మంది సభ్యులు రాష్ట్రపతిని కలిశారని, మణిపూర్లో జరుగుతున్న పరిణామాలను ఆమెకు వివరించారని ఖడ్గేతో పాటు ఇతర ప్రతిపక్ష నేతలు రాష్ట్రపతి భవన్ వెలుపల విలేకరులతో అన్నారు. ‘మేము రాష్ట్రపతికి ఒక వినతిపత్రం కూడా సమర్పించాము. హింసాత్మక సంఘటనలు ఎలా కొనసాగుతున్నాయి, ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు, వారిని నగ్నంగా ఊరేగించడం’ అని ఆయన అన్నారు. మణిపూర్లో జరిగిన హింసలో 5 వేల ఇళ్లు తగులబెట్టబడ్డాయని, 200 మందికి పైగా మరణించారని, 500 మందికి పైగా గాయపడ్డారని అన్నారు. ఇప్పటివరకు 60 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని తెలిపారు. బాధిత ప్రజలు ఉన్న పునరావాస శిబిరాల్లో సరైన జీవనం లేదా వైద్య సదుపాయాలు లేవని ఆయన అన్నారు. ‘మణిపూర్ సమస్యను ఆమె దృష్టికి తీసుకురావడానికి మేము రాష్ట్రపతిని కలిశాము. మణిపూర్ లేదా హరియాణా హింసాకాండ ఏదైనా కావచ్చు, ప్రతి విషయాన్ని రాష్ట్రపతికి చెప్పాము’ అని ఖడ్గే తెలిపారు. ‘ప్రధానమంత్రి మాట్లాడాలి. మణిపూర్లో పర్యటించాలి. మణిపూర్లో శాంతిని నెలకొల్పడానికి, రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అవసరమైన చర్యలను జాబితా చేయాలి’ అని ఆయన అన్నారు. ‘మణిపూర్లో ప్రస్తుత పరిస్థితిపై అత్యవసరంగా పార్లమెంటులో ప్రసంగించవలసిందిగా ప్రధాన మంత్రిపై ఒత్తిడి తీసుకురావాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. తర్వాత ఈ అంశంపై వివరణాత్మక, సమగ్రమైన చర్చ జరగాలి’ అని ప్రతిపక్ష కూటమి ఆ వినతిపత్రంలో పేర్కొంది. ‘ఇక ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడానికి మీ జోక్యాన్ని మేము తక్షణమే అభ్యర్థిస్తున్నాము. గత 92 రోజులలో జరిగిన విధ్వంసానికి జవాబుదారీతనం నిర్ణయించబడాలి. బాధిత వర్గాలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి’ అని వివరించింది. మణిపూర్ ప్రజల బాధలను తగ్గించడంలో ఆమె మద్దతు, జోక్యం చాలా కీలకమని పేర్కొంది. అనంతరం ఖడ్గే మాట్లాడుతూ తమ వినతిపత్రం, డిమాండ్లను పరిశీలిస్తామని రాష్ట్రపతి హామీ ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి వెంట తిరుచ్చి శివ, కనిమొళి, రాజీవ్ రంజన్ లల్లన్ సింగ్, అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్, సుశీల్ కుమార్ గుప్తా, సుస్మితా దేవ్, జయంత్ సింగ్, మనోజ్ రaా తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారనే దానిపై ప్రధాని సభకు రావడం లేదా ప్రకటన చేయడం లేదని ఖడ్గే అన్నారు. మణిపూర్పై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అనుమతించడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. ‘రాజ్యసభలో మాట్లాడేందుకు నన్ను అనుమతించిన కొద్ది సెకన్లలో నా మైక్ ఆపివేశారు. ఆపై ట్రెజరీ బెంచీలు శబ్దం చేయడం ప్రారంభించాయి. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడమే’ అని సభా నాయకుడిని, ప్రతిపక్షాన్ని సమానంగా చూస్తామని చైర్మన్ చెబుతున్నా ఇలా జరుగుతోందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు సుస్మితా దేవ్ కూడా రాష్ట్రంలోని మహిళలకు కలిగించిన ‘తీవ్రమైన హాని’ ని సరిదిద్దడంలో సహాయపడటానికి వివిధ వర్గాలకు చెందిన ఇద్దరు మణిపురి మహిళలను రాజ్యసభకు నామినేట్ చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష కూటమికి చెందిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా ఆమె ఈ సూచన చేశారు.