ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 2న ఏర్పాటైన కమిటీ జమిలీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 18,626 పేజీల నివేదికను రూపొందించింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణలకు రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచించినట్టు తెలిసింది. రెండు దశల్లో ఏకకాల ఎన్నికలు నిర్వహించాలని కమిటీ పేర్కొంది. తొలిదశలో పార్లమెంట్, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు ఒకే ఓటరు లిస్ట్ ఉంచే విషయంపై కూడా కమిటీ పలు సూచనలు చేసింది. రెండవ దశలో.. మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల ఎన్నికల మధ్య వందరోజుల వ్యవధి ఉంటుంది. రాష్ట్రాల శాసనసభల ఆమోదం స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమని కమిటీ పేర్కొంది. హంగ్.. అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కొత్త పార్లమెంటు లేదా శాసనసభను ఏర్పాటు చేయడానికి తాజా ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించడం విశేషం.