300 మార్క్కు చేరువలో కిలో ధర
వర్షాలతో సాగు, సరఫరాకు దెబ్బ
దిల్లీ, మదర్ డెయిరీ రేటు రూ.259
న్యూదిల్లీ : దేశంలో టమాటా టెర్రర్ కొనసాగుతోంది. ఎన్నడు లేని విధంగా టమాట ధర అకాశాన్నంటింది. నిత్యావసరాలు, పెట్రోల్, పాలు వంటివాటి ధరలు మండిపోతున్న సమయంలో టమాట ధరలు అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. దేశవ్యాప్తంగా అనేక మార్కెట్లలో కిలో టమాటా రూ.300 మార్కుకు దగ్గరలో ఉంది. ప్రతి వంటింటికి టమాటా కచ్చితంగా కావాల్సిన కూరగాయ కావడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. టమాటా సాగు, సరఫరాకు అధిక, లోటువర్షపాతం వల్ల నష్టం జరిగింది. కావాల్సిన స్థాయి వర్షాలు లేక సాగు దెబ్బతిన్నది. దాంతో సరఫరా తగ్గింది. ఈ సమస్య ఇప్పుడప్పుడు పరిష్కారమయ్యే పరిస్థితులు లేవు. అధిక వర్షాల్లో సాగు ఉండదు. కాబట్టి మరికొన్ని వారాల్లో ధర మరింత పెరిగి రూ.300ను దాటిపోవచ్చన్న అంచనా మార్కెట్ వర్గాల్లో ఉంది. ధరలు నియంత్రణలోకి రావాలంటే కనీసం రెండు నెలలు పట్టవచ్చని నేషనల్ కమాడిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్సీఎంఎల్) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా ఈమధ్యనే ఓ నివేదికలో పేర్కొన్నారు. సాధారణంగా జులైఆగస్టు, అక్టోబరు
నవంబరులో టమాటా సాగుకు అనుకూల పరిస్థితి ఉండదు. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. పంట కొరత ఏర్పడుతుంది.
అయితే దేశ రాజధాని దిల్లీలో కేజి టమాటా ధర బుధవారానికి రూ.259కి పెరిగింది. సఫల్ రీటైల్ స్టోర్ల ద్వారా మదర్ డెయిరీ ఈ ధరకు టమాటాలను విక్రయిస్తోంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం కిలో టమాటా రూ.203కు లభిస్తుండగా మదర్ డెయిర్ అవుట్లెట్లలో రూ.259 పలుకుతుందని తెలిసింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక రెండు నెలలుగా దేశవ్యాప్తంగా టమాటా సాగు ప్రభావితమైందని మదర్ డెయిరీ అధికారి ఒకరు అన్నారు. గత రెండు రోజులుగా ఆసియాలోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అయిన ఆజాద్పూర్ మండీకి టమాటా సరఫరా బాగా తగ్గిందని చెప్పారు. టమాటా సరఫరా తగ్గి, ధరలు పెరగడంతో రిటైర్ ధర ప్రభావితమవుతోందని అధికారి తెలిపారు.
ఆజాద్పూర్ మండీలో టమాటా నాణ్యతను బట్టి కిలో ధర రూ.170 నుంచి రూ.200 వరకు ఉంది. మూడు రోజులుగా మార్కెట్కు టమాటాల సరఫరా తగ్గిందని, భారీ వర్షాలతో పంట దెబ్బతిన్నదని ఆజాద్పూర్ టమాటా అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ తెలిపారు. బుధవారం 15శాతం పంట మాత్రమే మండీకి వచ్చిందని చెప్పారు.. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆరు చిన్న ట్రక్కుల్లో పంట రవాణా కాగా ధర మరింత పెరిగినట్లు తెలిపారు. అయితే రాగల పది రోజుల్లో సరఫరా మెరుగవుతుందని అంచనా వేశారు. ఇదిలావుంటే, టమాటా ధరలు అమాంతం పెరిగిన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర వంటి టమాటా ఎక్కువగా సాగయ్యే రాష్ట్రాల నుంచి పంటను సేకరించేలా నాఫెడ్, ఎన్సీసీఎఫ్ వంటి సంస్థలకు కేంద్రప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సబ్సిడీ ధరకు టమాటాలను విక్రయించేలా జులై 14న సంబంధిత అధికారులకు సూచించిన విషయం తెలిసిందే.