రామ్మోహన్ నాయుడుకు కేబినెట్
పెమ్మసానికి సహాయ మంత్రి
జనసేన, బీజేపీకి దక్కని అవకాశం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తొలివిడతగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు అవకాశం దక్కింది. ఈనెల 9వ తేదీన ఎన్డీఏ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు అవకాశం లభించింది. వరుసగా మూడుసార్లు శ్రీకాకుళం ఎంపీగా ఎన్నికైన కింజారపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా నరేంద్ర మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్మోహన్నాయుడు తండ్రి కింజారపు ఎర్రన్నాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆయన వారసుడిగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రివర్గంలోకి తొలిసారి ప్రవేశిస్తున్నారు. అలాగే తొలిసారి గుంటూరు లోక్సభకు ఎన్నికైన ప్రముఖ పారిశ్రామిక వేత్త పెమ్మసాని చంద్రశేఖర్కు జాక్పాట్ తగిలింది. ఆయనను కూడా కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు వారిద్దరికీ పీఎంవో నుంచి పిలుపువచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రశేఖర్కు సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక జనసేన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి తొలివిడత మంత్రివర్గ కూర్పులో అవకాశం దక్కలేదు. జనసేన మంత్రివర్గంలో చేరుతుందా ? లేదా ? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ఒకవేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సుముఖత వ్యక్తం చేస్తే మచిలీపట్నం లోక్సభకు ఎన్నికైన సీనియర్ ఎంపీ బాలశౌరికి సహాయ మంత్రి పదవి లభించే అవకాశం దక్కుతుందంటున్నారు. ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ శుక్రవారం సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. శనివారం కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగింది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. తొలివిడతలో ఇద్దరికి అవకాశం లభించగా, మలివిడతలో మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, అమలాపురం ఎంపీ దివంగత లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్ ఉన్నారు.