ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ సంగీత కచేరి కార్యక్రమం నిన్న రాత్రి క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం అవుతుందనగా, ఉగ్రవాదులు మిలటరీ దుస్తుల్లో మెషిన్గన్లతో బాంబులతో హాల్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 60మందికి పైనే మృతి చెందారు. వందమందికిపైగా గాయాపడ్డారు. ఈ దాడి తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. ఈ ఉగ్ర ఘటనపై తాము ముందుగానే రష్యాను హెచ్చరించినట్టు అమెరికా పేర్కొంది. మ్యూజిక్ కన్సర్ట్ వంటి పెద్ద ఎత్తున జనం గుమికూడే ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఈ నెల మొదట్లోనే రష్యాను హెచ్చరించినట్టు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి అడ్రీన్ వాట్సన్ తెలిపారు.డ్యూటీ టు వార్న్ విధానంలో భాగంగా బైడెన్ ప్రభుత్వం తమకు అందే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకుంటుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కిడ్నాపులు, ఎక్కువమందిని హత్యచేయాలన్న పథకాలపై శీఘ్రంగా స్పందించి ఆయా దేశాలకు సమాచారం అందిస్తుందని వివరించారు. అమెరికా ముందుగానే హెచ్చరించినప్పటికీ పుతిన్ ప్రభుత్వం అప్రమత్తం కాకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబున్నారు.