. 7న గుంటూరులో బహిరంగ సభ
. సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియా కూటమి పటిష్టతకు కృషి చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. అమరావతి రాజధానిపై ఇండియా కూటమి పార్టీల అధ్వర్యంలో మార్చి 7వ తేదీన గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ వెల్లడిరచారు. అనంతపురం హెచ్ఎల్సీ కాలనీ వద్ద ఉన్న సీపీిఐ కార్యాలయంలో సత్యసాయి, అనంతపురం జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశం సోమవారం జరిగింది.
అంతకుముందు రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ పదేళ్లు ప్రధానిగా పనిచేసిన నరేంద్ర మోదీ…ప్రజలకు ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. 2047 వరకు వికసిత్ భారత్ పేరుతో అభివృద్ధి చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని విమర్శించారు. ఈ పదేళ్లలో పేదవాడికి ఏమి చేశారు? రైతుల సమస్యలు ఏమన్నా పరిష్కారమయ్యాయా? యువతకు ఉద్యోగాలు కల్పించారా? అని సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తానని ప్రజలను మోసం చేశారన్నారు. కార్పొరేట్ పెద్దలు అంబానీ, అదానీలకు మోదీ ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. విరాళాల రూపంలో భారీగా నిధులు సేకరించి…ఎన్నికల్లో గెలవడానికి ముందుకొస్తున్నారన్నారు. 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచితంగా రేషన్ ఇస్తుంటే పేదరికం ఎలా తగ్గిందని చెబుతారని నిలదీశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల చొప్పున పదేళ్లలో 20 కోట్లమందికి ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ ప్రభుత్వంగా మారిందన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టడానికి ఇండియా కూటమి మరింత బలపడాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రక్షణ కోసం ఈనెల 11న విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర సమస్యలపై ఇండియా కూటమి ద్వారా ముందుకు సాగుతామన్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని బలోపేతం చేసుకొని మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం ఐదు లక్షల మందితో భారీ ర్యాలీ జరిగిందని, ర్యాలీలో ఇండియా నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖడ్గే, అఖిలేశ్ యాదవ్, డి.రాజా, సీతారాం ఏచూరి, తేజస్వీ యాదవ్ తదితరులు పాల్గొన్నారని చెప్పారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్, జిల్లా కార్యదర్శి జాఫర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి వేముల యాదవ్, అనంత జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, మల్లికార్జున పాల్గొన్నారు.