. అందుకే విపక్ష నేతలపై దాడులు
. ఏపీలో అల్లర్లపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి
. జగన్, చంద్రబాబుది బాధ్యతారాహిత్యం
. బీఆర్ఎస్ పాపాల వల్లే బీజేపీ పెరిగింది
. సీపీఐ కార్యదర్శి నారాయణ
విశాలాంధ్ర – హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం, నిరాశ, నిస్పృహలతోనే బీజేపీ నాయకులు ప్రతిపక్షాల నాయకులపై దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతూ అరెస్టు చేస్తున్నారని… చివరకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోని మహిళలను బెదిరించి వారి నాయకులపైనే కేసులు పెట్టించే నీచ స్థాయికి బీజేపీ దిగజారిందన్నారు. మరోవైపు కేజ్రివాల్ను చంపేస్తామని, కోసేస్తామని నీచమైన భాషలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రోరైల్లో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు రాతలు రాయిస్తూ మానసికంగా బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. తాజాగా తెలంగాణ సీఎంను కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని, అయితే అది సాధ్యం కాలేదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఇలాంటి చర్యలను కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్.బాలమల్లేష్, ఈటీ నరసింహాలతో కలిసి డాక్టర్ నారాయణ మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దిల్లీలో బిజెపి గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆప్, కాంగ్రెస్ కలిసిపోవడం తోపాటు సీఎం కేజ్రీవాల్పై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపడంతో ప్రజలు సామూహికంగా బీజేపీని ఓడిరచేందుకు సిద్ధపడ్డారన్నారు. దిల్లీలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆయనపై ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సిరా పోయడం, రాళ్లు రువ్వడంతో పాటు చుట్టుపక్కల వారిని బెదిరించారని మండిపడ్డారు. తెలంగాణలో ధరణి కేసీఆర్ను అధికారం నుంచి దూరం చేయగా, ఏపీలో భూమాతతో జగన్ కూడా అధికారాన్ని కోల్పోబోతున్నారని నారాయణ అన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రపదేశ్లో జరిగిన అల్లర్లు, అరాచకాలపై ‘సిట్’ తో విచారణ అంతా బోగస్ అని… వాస్తవాలు బయటకు రావాలంటే జ్యుడిషియల్ విచారణ జరపించాలని నారాయణ డిమాండ్ చేశారు. సిట్ విచారణలో భాగంగా 124 మందిని అరెస్ట్ చేశారని, అయితే అల్లర్లకు కారణమైన నాయకులు తప్పించుకునేందుకు, వారి పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు పోలీసులతో కలిసి అమాయకులను సరెండర్ చేయించారని విమర్శించారు. ఏపీలో వైసీపీకి, జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రపంచంలో, దేశంలో ఎక్కడ ఉన్నా తరలివచ్చిన ఓటర్లు జగన్కు వ్యతిరేకంగా పోలింగ్లో పాల్గొన్నారని, దీనిని తట్టుకోలేకనే వైసీపీ అరాచకాలు సృష్టించిందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో అల్లర్లు పథకం ప్రకారం జరిగినవేనని… వైసీపీకి పోలీసులు సహకరించారన్నారు. చివరి నిమిషంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కొంతమంది అధికారులను మార్చనట్లయితే ఏపీలో 50 శాతం ధ్వంసమయ్యేదని తెలిపారు. ఏపీలో ఇంత పెద్ద ఎత్తున అరాచకాలు జరుగుతుంటే వాటిని ఆపాల్సిన బాధ్యత కలిగిన సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకు లేదా అని నారాయణ ప్రశ్నించారు. ఎన్నికల హింస నుంచి ప్రజలను కాపాడాల్సిన ఇద్దరూ, తమకేమీ పట్టనట్టుగా విదేశాలకు పారిపోవడం పూర్తిగా బాధ్యతరాహిత్యమని విమర్శించారు.
బీఆర్ఎస్ అసహనంగా ఉంది
తెలంగాణలో అధికారం చేజారాక… బీఆర్ఎస్ నాయకులు అసహనంతో వ్యవహరిస్తున్నారని నారాయణ అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరే ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలల వరకు పూర్తి స్థాయి మంత్రివర్గం లేకుండానే పాలించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి రోజు నుంచే వారిపై విమర్శలు చేయడం సమంజసం కాదని హితువుపలికారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సమయం పడుతుందన్నారు. బీఆర్ఎస్ నియంతృత్వ పోకడలు, ఆ పార్టీ చేసిన పాపాల వల్లనే రాష్ట్రంలో బీజేపీ పెరిగిందని నారాయణ అన్నారు. ఇప్పుడు అవే తప్పులు కాంగ్రెస్ చేయరాదని, కాంగ్రెస్ వల్ల బీజేపీ పెరిగే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. మతోన్మాద బీజేపీని దెబ్బకొట్టాలంటే తమిళనాడు సీఎం స్టాలిన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అక్కడ స్టాలిన్ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని విశాల ఐక్య వేదికను ఏర్పాటు చేశారని… ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలను కలుపుకు పోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ కూడా విశాల ప్రాతిపదికన ఆలోచన చేయాలని, తాము ఏది చెబితే, అది వినాలనే సాంప్రదాయం మంచిది కాదన్నారు. బెంగుళూరులో రేవ్ పార్టీని ఏర్పాటు చేసిన వారిని, అక్కడ అవకాశం కల్పించిన వారిపైన, డ్రగ్స్ సరఫరా చేసిన వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు.
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: పశ్యపద్మ
రాష్ట్రంలో రైతులు పండిస్తున్న అన్ని రకాల వడ్లకు ప్రభుత్వం రూ.500ల బోనస్ ఇవ్వాలని పశ్య పద్మ డిమాండ్ చేశారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయించడం అన్యాయమన్నారు.‘ రైతులు పండిరచిన వడ్లకు రూ.500ల బోనస్ ఇస్తాం’ అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిందని… సన్న వడ్లు, దొడ్డు వడ్లు అని ఎక్కడా చెప్పలేదని ఆమె గుర్తు చేశారు.