. మాజీ సీఎంకు అంతా తెలుసన్న ఈడీ
. కవితకు బెయిల్ ఇవ్వద్దని విజ్ఞప్తి
. తీర్పు రిజర్వు చేసిన దిల్లీ హైకోర్టు
న్యూదిల్లీ : మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై దిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ వ్యాపారం గురించి కేసీఆర్కు కవిత ముందే వివరాలు చెప్పారని కోర్టుకు తెలిపింది. ‘కవిత తన టీమ్ బుచ్చిబాబు, అభిషేక్, అరుణ్ పిళ్లైలను దిల్లీలో కేసీఆర్కు పరిచయం చేశారు. బుచ్చిబాబు.. కేసీఆర్కు సమీర్ మహేంద్రును పరిచయం చేశారు. ఆయన్ని అడిగి వ్యాపారం వివరాలు కేసీఆర్ తెలుసుకున్నారు’ అని ఈడీ వివరించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై దిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై మంగళవారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ చేపట్టారు. సోమవారం కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. తాజాగా ఈడీ, సీబీఐ కవితకు బెయిల్ ఇవ్వవద్దంటూ వాదనలు వినిపించాయి. రెండు పక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. ‘‘దిల్లీ లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్. ఈ కేసులో అక్రమ సొమ్ము కవితకు చేరింది. దీనికి సంబంధించిన వాట్సప్ చాటింగ్స్ మా వద్ద ఉన్నాయి. ఇండియా హెడ్ ఛానల్ లో పెట్టుబడి పెట్టారు. ఫోన్ లో డేటాను ధ్వంసం చేశారు. విచారణకు ముందే ఫోన్ సాక్ష్యాలు ధ్వంసం చేశారు. ఈడీకి ఇచ్చిన ఫోన్ లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. డిజిటల్ డేటా ధ్వంసంపై పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దు. సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం. ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు. గోప్యత హక్కును భంగపరచలేదు’’ అని పేర్కొన్నారు. ఇక ‘‘నిబంధనలను పాటిస్తూ చట్ట ప్రకారమే కవిత అరెస్ట్ జరిగింది. లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉంది. లిక్కర్ పాలసీ ద్వారా కవిత లబ్ధి పొందారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.ఈ సమయంలో కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. కవితకు బెయిల్ ఇవ్వడానికి మెడికల్ కారణాలు కూడా లేవు’’ అని సీబీఐ వాదనలు వినిపించింది. రెండు పక్షాల వాదనలు విన్న హైకోర్టు… కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వు చేసింది.