. 1-జనపథ్కు మారిన సీఎం అధికారిక నివాసం
. అమిత్ షాకు ఆర్థిక సమస్యలపై వినతి
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం దిల్లీకి బయలుదేరి వెళ్లిన సీఎం 24 గంటల వ్యవధిలోనే మరలా తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. గంటకు పైగా ఈ భేటీ సాగింది. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు మరోసారి చంద్రబాబు వివరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడిరచారు. అస్తవ్యస్థ నిర్వహణ, అవినీతి కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు తెలిపారు. 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పడాన్ని, అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేత పత్రాలను అమిత్ షాకు వివరించానని చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఎన్డీఏ కూటమికి రాష్ట్ర ప్రజలు కట్టబెట్టిన విజయాన్ని గౌరవిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను తిరిగి పట్టాలెక్కించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. రాత్రికి దిల్లీలోనే బస చేసిన చంద్రబాబు బుధవారం ఉదయం 1
జన్పథ్లో తనకు కొత్తగా కేటాయించిన అధికారిక నివాసంలో పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రికి 50అశోకా రోడ్డులో అధికారిక నివాసం ఉండేది. ఇకపై చంద్రబాబు 1
జన్పథ్లో దిగనున్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. జన్పథ్ నివాసంలో చంద్రబాబును బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అలాగే ఈ పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నప్పటికీ, అమిత్ షాతో ఒక్కరితో మాత్రమే చంద్రబాబు దిల్లీ పర్యటన పరిమితమైంది.