. మణిపూరీల కష్టాలు, కన్నీళ్లు పట్టవా
. వారిలోని ఆక్రోశం కనిపించదా
. మోదీ నిస్సిగ్గు ఉదాసీనతకు తాజా పరిస్థితులే తార్కాణం
. ‘ఇండియా’ కూటమి విమర్శలు
ఇంఫాల్ : రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా ప్రధాని మోదీ వైఖరి ఉందని, మణిపూర్ కాలిపోతుంటే ఫ్లూటు వాయించుకుంటున్నారని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి విమర్శించింది. మణిపూర్ ప్రజల వెతలు, కన్నీళ్లు, కష్టాలతో పాటు వారిలోని ఆగ్రహం, ఆక్రోశం కూడా పాలకులకు పట్టడం లేదన్నారు. అనిశ్చితిని పరిష్కరించడంలో కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో విఫలమయ్యాయని దుయ్యబట్టింది. కుకీ, మయితె వర్గాల మధ్య సమస్య పరిష్కారానికి పటిష్ఠ చర్యలేమీ తీసుకోవడం లేదని 21 ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మనస్సులోని మాట వినడమే మోదీకి సరిపోతుందని, ఇక 21 కోట్ల భారతీయుల మనోగతం ఆయన ఎలా వినగలరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు మోదీ నిసిగ్గు ఉదాసీనతకు తార్కాణమని అన్నారు. ‘కుకీ, మయితె వర్గీయుల మధ్య పరిస్థితులు ఎలా బాగుపడతాయో తెలియదు. అందుకోసం కేంద్రంగానీ రాష్ట్ర ప్రభుత్వంగానీ పటిష్ఠ చర్యలేమీ తీసుకోవడం లేదు. రోమ్ తగలబడినప్పుడు నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా ప్రధాని మోదీ ప్రస్తుత ప్రవర్తన ఉంది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్పై నమ్మకాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా కోల్పోయారు. ఆయనకు ఏ వర్గం నుంచి మద్దతు లేదు. చాలా చోట్ల కాల్పులు, ఇళ్లకు నిప్పు పెడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. బీజేపీ యంత్రాంగం పూర్తిస్థాయిలో విఫలమైంది. ఇప్పటికే 160 మంది చనిపోయారు. కొన్ని వేల మంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తిరిగి ఇళ్లకు ఎప్పుడు వెళతామోనని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో చాలా క్లిష్ఠపరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయం పూర్తిగా స్తంభించింది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిలో అభద్రతా భావం, అనిశ్చితి ఉంది’ అని శని, ఆదివారాల్లో హింస బాధిత రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసిన ‘ఇండియా’ కూటమి ప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తంచేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తూ, సత్వర సహాయక చర్యలు, పునరావాసం కల్పనను కోరుతూ గవర్నర్ అనసూయ ఉయికెకు వినతిపత్రాన్ని అందజేశారు. స్థానికుల పరిస్థితిని అలక్ష్యం చేయొద్దని కోరారు. బాధితుల కన్నీటిగాథలను గవర్నర్కు వివరించారు. శిబిరాల్లోని దారుణ పరిస్థితులను. పిల్లలకు ప్రత్యేక సంరక్షణ అవసరాన్ని తెలియజేశారు. అగమ్యగోచరంగా మారిన విద్యార్థుల పరిస్థితిని వెల్లడిరచారు. అందరి పరిస్థితులను చక్కబెట్టడం కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని తెలిపారు.
‘రాష్ట్రంలో తక్షణమే శాంతిని నెలకొల్పాలి, సామరస్యాన్ని పెంపొందించాలి. బాధితులకు పునరావాసం కల్పించాలి’ అని గవర్నర్ను డిమాండ్ చేశారు. నిరాధార ఉదంతులతో స్థానిక తెగల మధ్య అపనమ్మకం పెరుగుతూ పరిస్థితి మరింతగా క్షీణిస్తోందని, ఇందుకు ఇంటర్నెట్పై నిషేధం కూడా ఒక కారణమేనని చెప్పారు. మణిపూర్లోని అన్ని వర్గాల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్న క్రమంలో సమస్య పరిష్కారంలో మరింత జాప్యం మంచిది కాదని హితవు పలికారు. శాంతి, సామరస్యాన్ని నెలకొల్పేందుకు పటిష్ఠ చర్యలను తక్షణమే తీసుకోవాలని కోరారు. బాధితులకు పునరావాసాన్ని సత్వరమే కల్పించాలని గవర్నర్కు విజ్ఞప్తిచేశారు. 89 రోజులుగా మణిపూర్లో శాంతిభద్రతలు క్షీణించడం గురించి కేంద్రప్రభుత్వానికి తెలియజేసి వారి జోక్యాన్ని కోరడం సముచితమని ఎంపీలు సూచించారు.
క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించడంతో పాటు బాధితులను కలిసి వారి వెతలను పంచుకునేందుకు ఎంపీలు మణిపూర్లోని ఇంఫాల్, బిష్ణుపూర్, చురచాంద్పూర్లోని సహాయ శిబిరాలను సందర్శించారు. అక్కడివారి కష్టాలను తెలుసుకొని ధైర్యం చెప్పారు. ప్రతినిధుల బృందంలో అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్), సంతోశ్ కుమార్ (సీపీఐ), ఏఏ రహీం (సీపీఎం), సుస్మితా దేవ్ (టీఎంసీ), మహువా మాజి (జేఎంఎం), కణిమొళి కరుణానిధి (డీఎంకే), మహమ్మద్ ఫైజల్ (ఎన్సీపీ), చౌదరి జయంత్ సింగ్ (ఆర్ఎల్డీ), మనోజ్ కుమార్ రaా (ఆర్జేడీ), ఎన్కే ప్రేమచంద్రన్ (ఆర్ఎస్పీ), తిరుమవలన్ (వీసీకే), రాజీవ్ రంజన్ (లలన్) సింగ్, అనీల్ ప్రసాద్ హెగ్డే (జేడీయూ), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), మహమ్మద్ బషీర్ (ఐయూఎంఎల్), సుశీల్ గుప్తా (ఆప్), అరవింద్ శావంత్ (శివసేన యూబీటీ), ఫులో దేవి నేతం, కె.సురేశ్ (కాంగ్రెస్) ఉన్నారు.