సీపీఐ, ఏఐకేఎస్ సంతాపం
న్యూదిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి, అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంజాన్ శుక్రవారం తెల్లవారుజామున 3.40 గంటలకు తుదిశ్వాస విడిచారు. అంజాన్ అకాల మరణం పట్ల సీపీఐ ప్రగాఢ సంతాపం తెలిపింది. ఆయన తండ్రి డాక్టర్ ఏపీ సింగ్ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. హెచ్ఎస్ఆర్ఏ (హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్) ఉద్యమాలలో సింగ్ పాల్గొన్నారు. బ్రిటిష్ హయాంలో సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారు. కాగా, తన 20 ఏళ్ల వయసులో అంజాన్ నేషనల్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థుల సమస్యలు వినిపించడంలో ప్రసిద్ధి చెందిన అంజాన్ వరుసగా నాలుగు పర్యాయాలు లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్ష పదవి చేపట్టారు. అర డజను భాషలలో ప్రతిభావంతులైన వక్త అయిన అంజాన్ తన యూనివర్సిటీ రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ పోలీసు`పీఏసీ తిరుగుబాటుకు చెందిన ప్రధాన నాయకులలో ఆయన ఒకరు. అంజాన్ తన రాజకీయ ప్రయాణంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆయన రాజకీయ, సైద్ధాంతిక విశ్వాసం, విద్యార్థుల ఉద్యమాలకు నాయకత్వం వహించే సామర్థ్యం కారణంగా 1979లో అఖిల భారత విద్యార్థి సంఘం (ఏఐఎస్ఎఫ్) లూథియానా సదస్సులో అధ్యక్షుడయ్యారు. 1985 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1960 దశకం చివరలో భారత కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆయన తన చివరి శ్వాస వరకు పార్టీలోనే కొనసాగారు. 1989లో కోల్కతాలో జరిగిన సీపీఐ 14వ జాతీయ మహాసభల్లో పార్టీ జాతీయ సమితికి, 1992లో హైదరాబాద్లో జరిగిన 15వ జాతీయ మహాసభల్లో జాతీయ కార్యవర్గానికి, 1995లో దిల్లీలో జరిగిన 16వ మహాసభల్లో జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. చివరి శ్వాస వరకు ఆ పదవిలో కొనసాగారు. 1997లో త్రిస్సూర్ జాతీయ సదస్సు సందర్భంగా ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2001, 2006, 2010, 2016 సంవత్సరాలలో కూడా అదే పదవికి అతుల్ కుమార్ అంజాన్ ఎన్నికయ్యారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సహా అనేక సిఫార్సులు చేసిన స్వామినాథన్ కమిషన్లోని ఏకైక రైతు సభ్యుడిగా ఆయన చేసిన కృషి ప్రత్యేకమైనది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమం, రైతు ఉద్యమం, పార్టీ నిర్మాణంలో అతుల్ కుమార్ అంజాన్ అద్భుతమైన పాత్ర పోషించారు. మితవాద, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిన యోధుడు. అంజాన్ మరణం దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి, రైతు ఉద్యమానికి తీరని లోటని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఒక ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు. అంజాన్కు పార్టీ ఘన నివాళులు అర్పిస్తూ, అన్ని రకాల దోపిడీ, వివక్ష లేని నవ భారతదేశం కోసం పోరాడటానికి ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు రాజా పిలుపునిచ్చారు. కాగా, అంజాన్ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు లక్నోలో జరుగుతాయని సీపీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
అంజాన్ మృతికి రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తల సంతాపం
అతుల్ కుమార్ అంజాన్ మృతి పట్ల అనేక రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు సంతాపం తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం పోరాడిన నాయకుడు అంజాన్ అని రైతు నాయకుడు రాకేశ్ తికైత్ గుర్తు చేశారు. ఆర్ఎల్డీ పార్టీ నాయకుడు జయంత్ సింగ్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్లో అతుల్ కుమార్ అంకితభావంతో కూడిన ప్రజా సేవకుడని పేర్కొంటూ…ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.
రైతు ఉద్యమానికి తీరనిలోటు: రావుల వెంకయ్య
రైతుల సంక్షేమానికి నిబద్దతతో అవిశ్రాంత కృషి చేసిన అతుల్కుమార్ అంజన్ మృతి దేశంలో రైతు ఉద్యమానికి తీరనిలోటుగా అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షులు రావుల వెంకయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామినాథన్ కమిషన్లోని ఏకైక రైతు సభ్యునిగా ఆయన చేసిన కృషి గమనార్హమైనదిగా పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలు, వినాశకర మూడు రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిర్వహించిన మహత్తర పోరాటం, రైతుల తాజా ఉద్యమాన్ని సరైన దిశలో నడిపించడంలో అతుల్ ముఖ్యమైన పాత్ర పోషించారని నివాళులర్పించారు. సంయుక్త కిసాన్ మోర్చా నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఆయనతో రైతు నేతలు నిత్యం సంప్రదింపులు జరిపేవారు. తన పోరాటాల ద్వారా అంజన్ దేశంలో ప్రముఖ రైతు నాయకుడుగా ఆవిర్భవించారనీ, ఆయన మృతి దేశంలోని రైతు సంఘాలు, వామపక్ష ఉద్యమానికి పెద్ద దిగ్భ్రాంతిని కలిగించిందని రావుల వెంకయ్య పేర్కొన్నారు. అంజన్ మృతి సమాచారం తెలిసిన వెంటనే వెంకయ్య హుటాహుటిన విజయవాడ నుంచి లక్నో బయలుదేరి వెళ్లారు. లక్నోలో అంజన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. భార్య, పిల్లలు, ఇతర కుటుంసభ్యులను ఊరడిరచారు. అంత్యక్రియల ఏర్పాట్లను కుటుంబ సభ్యులతో సమీక్షించారు. అంజన్ మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని రావుల వెంకయ్య తెలిపారు.
రైతు సంఘ నేతల ప్రగాఢ సంతాపం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్ మృతి రైతాంగానికి తీరని లోటని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పి.రామచంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ.కాటమయ్య, అధ్యక్షులు జి.ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో సంతాపాన్ని, అంజాన్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. అంజాన్ రైతాంగ సమస్యలపై అనేక ఉద్యమాలు నిర్వహించారని, కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం జరిగిన పోరాటంలో ఆయన అన్ని రైతు సంఘాలను, రైతులను ఏకతాటిపైకి తెచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్లో సభ్యులుగా రైతాంగ ఉత్పత్తులకు సి2G50 ప్రకారం మద్దతు ధర కల్పించేందుకు, రైతులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అనేక ఉద్యమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. కొద్ది కాలంగా ఆయన క్యాన్సర్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించటం బాధాకరమని, వారి మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.