. అవి హెరిటేజ్ కీలకపత్రాలన్న కంపెనీ సెక్రటరీ
. వైసీపీ అధికారంలోకి రాదన్న భయంతోనే దగ్ధం : లోకేశ్
. వేస్ట్ పేపర్లు అంటూ కొట్టిపారేసిన సీఐడీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో తాడేపల్లి సిట్ కార్యాలయం కాంపౌండ్లో కొన్ని పత్రాలను సిబ్బంది దహనం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. వీరు దహనం చేసిన పత్రాల్లో హెరిటేజ్ కంపెనీకి సంబంధించినవని పేర్కొంటూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేగింది. అవి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిట్ స్వాధీనం చేసుకున్న హెరిటేజ్కు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దీంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. తమపై అక్రమ కేసులు బనాయించేందుకు సృష్టించిన దొంగ పత్రాలు వైసీపీ అధికారం కోల్పోతే బయటపడతాయనే అధికారులు కాల్చివేశారంటూ ఆరోపించారు. పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా? అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. నేర పరిశోధనపై దృష్టిసారించాల్సిన ఏపీ సీఐడి జగన్ పుణ్యమా అని క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్గా మారిపోయిందని విమర్శించారు. మేము ఎప్పటినుంచో చెబుతున్న మాటలు నేడు నిజమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కొందరు ఐపీఎస్లు తమ ఉద్యోగ ధర్మాన్ని వీడి జేపీఎస్్ (జగన్ పోలీస్ సర్వీస్) గా రూపాంతరం చెందారు. మా కుటుంబంపై బురదజల్లేందుకు జగన్ ఆదేశాలతో భారీ కుట్ర జరిగింది. నిబంధనలకు విరుద్దంగా సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వాన అనుమతులు లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. జగన్ ప్రభుత్వానికి అంతిమ ఘడియలు సమీపించాయని తెలిసిపోవడంతో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ పత్రాలను తగులబెడుతున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలవాల్సిన కొందరు ఐపీఎస్లు ఇంతటి బరితెగింపునకు పాల్పడటం దేశచరిత్రలో ఇదే ప్రథమం. చట్టాన్ని ఉల్లంఘించి చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.
ఆ డాక్యుమెంట్లు చాలా కీలకమైనవి : హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ
ఈ ఘటనపై హెరిటేజ్ కంపెనీ సెక్రటరీ ఉమా కాంత్ బారిక్ స్పందిస్తూ సీఐడీ అడిషనల్ ఎస్పీకి లేఖ రాశారు. సీఐడీ కస్టడీలో ఉన్న తమ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మినిట్ పుస్తకాలను తాము అధికారుల కోరిక మేరకు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. హెరిటేజ్కు సంబంధించిన పత్రాలను దగ్ధం చేసినట్లు సోషల్ మీడియా, టీవీ వార్తల్లో వచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ తాము ఇచ్చిన డాక్యుమెంట్లు చాలా కీలకమైనవని పేర్కొన్నారు. తాము దర్యాప్తు సంస్థకు పూర్తిగా సహకరించడమే కాకుండా న్యాయబద్ధులై ఉంటామని, ఇదే సమయంలో డాక్యుమెంట్ల భద్రత కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశమని తెలియజేశారు.
అవి వేస్ట్ పేపర్లంటూ సీఐడీ వివరణ
ఫైళ్ల దగ్ధం ఘటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపడంతో సీఐడీ వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అంటూ వివరణ ఇచ్చింది. తాము మొత్తం 5 కేసుల్లో ఛార్జ్షీట్ వేశామని, ఒక్కో ఛార్జ్షీట్లో 8 వేల నుంచి 10 వేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని పేర్కొంది. చాలా ఫోటోస్టాట్ కాపీలు తీయాల్సి వస్తుందని ఐజీ తెలిపారు. జిరాక్సులు తీసే సమయంలో ఫోటోస్టాట్ మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని ఇంక్ లెవల్ కూడా తగ్గిపోతుందని వివరణ ఇచ్చారు. దీనివలన కొన్ని కాపీలు సరిగ్గా రావని, వీటన్నింటిని కూడా వేస్టు పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని, వాటి స్ధానంలో తాజా కాపీలు తీసుకుంటామని ఐజీ వెల్లడిరచారు. ప్రస్తుతం దహనం చేసిన కాగితాలు కూడా అటువంటివేనంటూ వివరణ ఇచ్చారు.
సిట్ పత్రాలు దగ్ధం చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్
తాడేపల్లి సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. సీఐడీ చీఫ్ రఘురామిరెడ్డి ఆదేశాల మేరకు ఫేక్ ఆధారాలు, కీలక డాక్యుమెంట్లను సిబ్బంది తగులబెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో హెరిటేజ్ సంస్థకు సంబంధించిన పత్రాలను దగ్ధం చేయటం వెనుక ఆంతర్యం ఏమిటి? తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం మాదిరిగా ఏపీలో సిట్ అక్రమ కేసుల వ్యవహారం సాగినట్లుగా గోచరిస్తున్నది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా సీఐడీ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించడంలో, బెదిరింపులకు గురిచేయడంలో కీలకపాత్ర పోషించింది. వివిధ అక్రమ కేసులలో తప్పుడు పత్రాలు సృష్టించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల తదుపరి నూతన ప్రభుత్వం ఏర్పడినట్లయితే సీఐడీ అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతోనే కీలక పత్రాలను దగ్ధం చేశారా? అనే అనుమానం కలుగుతోంది. అందువల్ల సిట్ కార్యాలయంలో పత్రాలు తగలబెట్టిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.