విశాలాంధ్ర`గుంటూరు: ఇండియా కూటమి బలపర్చిన గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ను కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ… మేడికొండూరు మండలంలోని వివిధ గ్రామాలలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఓటర్లను స్వయంగా కలిసి ఓట్లు వేయాలని కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం… రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. కేంద్ర ంలోని మోదీసర్కారుకు, రాష్ట్రంలోని జగన్ సర్కారుకు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు బైరా పట్నం రామకృష్ణ, సీపీఐ జిల్లా నాయకులు మునుగోటి శ్రీనివాసరావు, తాటికొండ సీపీఐ కార్యదర్శి ముప్పాళ్ల శివశంకర్, సీపీఐ నాయకుడు కారంపూడి చెన్నకేశవ, సీపీఎం నాయకుడు భాస్కరరావు, రాష్ట్ర నాయకులు వై రాధాకృష్ణమూర్తి, వెంగళరావు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.