వాషింగ్టన్ : ఇజ్రాయిల్ ప్రధాని నఫ్తాలి బెన్నట్ అమెరికా పర్యటనకు నిరసనగా వాషింగ్టన్లో ఆందోళన కారులు భారీ ర్యాలీ చేశారు. అఫ్గాన్ గందరగోళాల నేపథ్యంలో బెన్నెట్, బైడెన్ మధ్య ఖరారైన సమావేశాన్ని వాయిదా వేశారు. పలస్తీనా ప్రజలకు సంఫీుభావంగా పలస్తీనా న్యాయవాదులు నిరసనలో పాల్గొన్నారు. అధ్యక్షుడు బైడెన్ ‘ఇజ్రాయిల్ వర్ణవివక్షతకు బేషరతు మద్దతు’ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వైట్హౌస్ ఎదురుగా లాఫాయెట్ పార్కులో ర్యాలీ నిర్వహించారు. పలస్తీనియన్లను జెరూసలేంలోని షేక్జర్రా ఇళ్లనుండి బలవంతంగా బహిష్కరించడం వంటి హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణించారు. బెన్నెట్ ప్రభుత్వం గాజాలో పునర్నిర్మాణాన్ని నిలిపివేస్తోందన్నారు. 265 మంది పలస్తీనా పౌరులను ఇజ్రాయిల్ హత మార్చిందన్నారు. పలస్తీనా నిరసనకారులను చంపడం, పాలస్తీనా భూములను స్వాధీనం చేసుకోవడం, గాజా పునర్నిర్మాణంలో జోక్యం తగదని ఇజ్రాయిల్ను హెచ్చరించారు. పాలస్తీనా యువజన ఉద్యమకార్యకర్త లారా అల్బాస్ట్ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటాన్ని తీవ్రంగా విమర్శించారు. అనేక సంవత్సరాల సరిహద్దు నిరసనల తరువాత గాజాలోకి వస్తువుల రవాణాపై ఇటీవల విధించిన ఆంక్షలు సడలించినట్లు ఇజ్రాయిల్ తాజాగా పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా బెన్నెట్ పదవి చేపట్టిన అనంతరం మొదటి విదేశీ పర్యటన ఇదే.