ఇస్తాంబుల్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన బెల్ 212 హెలికాప్టర్కు సిగ్నల్ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు తుర్కియే రవాణశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ వ్యాఖ్యానించారు. హెలికాప్టర్లో సిగ్నల్ వ్యవస్థ ఆన్ కాలేదు. అసలు అటువంటి వ్యవస్థే దానిలో లేదేమోనని ఆయన అనుమానం వెలిబుచ్చారు. తుర్కియేకు చెందిన బైరక్తర్ డ్రోన్ సహాయచర్యల్లో పాల్గొంది. ఇదే ప్రమాదస్థలాన్ని తొలుత గుర్తించింది. తాము హెలికాప్టర్ సిగ్నల్ కోసం మొదట తీవ్రంగా ప్రయత్నించామని, కానీ తమకు ఎటువంటి ఆధారం లభించలేదని ఖదీర్ తెలిపారు. సాధారణంగా తాము ఇలాంటి ఆపరేషన్లలో వాటి కోసం వెతుకుతామని, రైసీ, వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్లకు కచ్చితంగా అటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పారు. ఇరాన్ విదేశాంగశాఖ మాజీ మంత్రి జావెద్ జారిఫ్ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. అంతిమంగా 45 ఏళ్ల నాటి హెలికాప్టర్ను ఉపయోగించాలనుకోవడం ఇరాన్ నిర్ణయమని, అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించారని తెలిపారు. ఇందులో మరొకరి పాత్ర లేదని తేల్చి చెప్పారు. అంతకుముందు జారిఫ్ స్పందిస్తూ తమ హెలికాప్టర్లకు అవసరమైన విడి భాగాలు కొనుగోలు చేయనీయకుండా అమెరికా విధించిన ఆంక్షలే అధ్యక్షుడి ప్రాణాలు బలితీసుకొన్నట్లు ఆరోపించారు. విమానాలు, హెలికాప్టర్ల నిర్వహణ లోపాల కారణంగా 1979 నుంచి ఇరాన్లో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రక్షణ, రవాణాశాఖ మంత్రులు సహా అనేకమంది కమాండర్లు మరణించిన ఘటనలు ఉన్నాయి. ఆదివారం కూలిన బెల్ 212 హెలికాప్టర్ను 1979 నాటి ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ చివరిరాజు షా మహ్మద్ రెజా పహ్లావీ హయాంలో సమకూర్చుకొని ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.