. మరో 4 రాష్ట్రాల ప్రైమరీల్లో గెలుపు
. ఒపీనియన్ పోల్స్లో బైడెన్ వెనుకంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ట్రంప్, డెమొక్రట్ల తరపున జో బైడైన్ ప్రైమరీ ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. తాజాగా మరో నాలుగు రాష్ట్రాలు కైవసం చేసుకున్నారు. రోడె ఐలాండ్, కెనెక్టికట్, న్యూయార్క్, విస్కోంసిన్లో రసవత్తరంగా పోరు సాగింది. నాలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పీఠానికి పోటీ చేసే అనేక అభ్యర్థులు ఉన్నాగానీ ఇటు ట్రంప్కు అటు బైడెన్కు సమర్థ ప్రత్యర్థి లేకుండా పోయారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీల్లో ఇద్దరు గెలుపు నమోదు చేశారు. ట్రంప్కు 75శాతం ఓట్లు రాగా బైడెన్కు 80శాతం ఓట్లు వచ్చాయి. ట్రంప్కు 1,860 మంది ప్రతినిధుల మద్దతు ఉంటే బైడెన్ మద్దతుదారుల సంఖ్య3,030కు పెరిగింది. అభ్యర్థికి కనీసం 1,968 మంది మద్దతు ఉండటం అవసరం. 2020 తరహాలోనే వీరిద్దరికి ప్రత్యక్ష పోరు ఏర్పడుతుందన్న అంచనాలు పెరిగాయి. కాగా, ఒపీనియన్ పోల్స్ ప్రకారం బైడెన్ కంటే ట్రంప్కు ఎక్కువ ఆదరణ ఉన్నట్ల్లు వెల్లడైంది. ఏడు రాష్ట్రాల్లో సర్వే చేయగా ఆరు రాష్ట్రాల్లో ట్రంప్కు ఆధిక్యం లభించనున్నట్లు తెలిసింది. బైడెన్పై ఓటర్లలో అసంతృప్తి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన వంటి సమస్యల పరిష్కారంలో ఆయన సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ తేల్చింది. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, ఉత్తర కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించారు. ఒక్క విస్కాన్సిన్లో ట్రంప్ కంటే బైడెన్ ముందంజలో ఉన్నారు. అరిజోనాలో మాత్రమే ట్రంప్కు ప్రతికూల పరిస్థితి ఉంది. ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ ప్రకారం బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ ఉండనుందని తెలిపింది.