ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని రెండో అతిపెద్ద నేవీ ఎయిర్స్టేషన్ పీఎన్ఎస్ సిద్ధిఖ్పై సోమవారం రాత్రి దాడి జరిగింది. బలూచిస్థాన్లో ఉన్న ఈ స్థావరంపై తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నలుగురు తీవ్రవాదులను హతమార్చారు. వారు లోపలికి ప్రవేశిస్తుండగానే గుర్తించి మట్టుబెట్టామని అధికారులు తెలిపారు. ఎయిర్స్టేషన్కు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడిరచారు. ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు సమాచారం. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కాల్పుల్లో పాకిస్థానీ బలగాలకు చెందిన డజను మంది మృతిచెందినట్లు తెలిపింది. పాకిస్థాన్ సైన్యం మాత్రం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. వారం రోజుల్లో ఈ ముఠా ఇలాంటి దాడికి యత్నించడం ఇది రెండోసారి. మార్చి 20న గ్వాదర్ పోర్టుపైనా తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురిని హతమార్చాయి. బీఎల్ఏను పాకిస్థాన్ సహా అమెరికా, బ్రిటన్ ఉగ్రసంస్థగా గుర్తించాయి. పాకిస్థాన్లోని అతిపెద్ద ప్రావిన్స్గా పిలిచే బలూచిస్థాన్ అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులను ఈ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా బీఎల్ఏ వేర్పాటువాద సంస్థ చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బలూచిస్థాన్లోని గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాక్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిలో చైనా పాలుపంచుకున్న విషయం తెలిసిందే.