మాస్కో: తమ దేశంలోని అమెరికా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర్వులు జారీచేశారు. అగ్రరాజ్యానికి చెందిన కంపెనీలు, పౌరుల ఆస్తులను సీజ్ చేసే ఆదేశాలపై సంతకాలు చేశారు. మాస్కోపై పశ్చిమ దేశాల ఆంక్షలకు బదులుగా ఈ చర్యకు పూనుకున్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్లోకి రష్యా బలగాలు ప్రవేశించిన తర్వాత మాస్కోకు చెందిన 300 బిలియన్ డాలర్ల ఆస్తులను పశ్చిమ దేశాలు ఫ్రీజ్ చేశాయి. ముఖంగా సెంట్రల్ బ్యాంకు రిజర్వులను వినియోగించుకోకుండా చేశాయి. రష్యా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల క్రమంలో పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా నష్టపోయిన రష్యాలోని వ్యవస్థలు, కంపెనీలు, వ్యక్తులు సైతం తమ ప్రభుత్వానికి పరిహారం కోసం దరఖాస్తు చేసుకునే అధికారం లభించింది. రియల్ ఎస్టేట్, కంపెనీలు, బ్యాంకు ఖాతాలు లేక షేర్ల వంటి అమెరికా ఆస్తుల రూపేణ ఈ పరిహారం బాధితులకు లభిస్తుంది. ఉక్రెయిన్పై యుద్ధం క్రమంలో రష్యాను పశ్చిమ దేశాలు ఏకాకి చేసిన విషయం తెలిసిందే.