సియోల్: ఉభయ కొరియా దేశాల మధ్య నిత్యం ఘర్షణలు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియాను ఉత్తరకొరియా తరచూ కవ్విస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల రెండు దేశాల మధ్య సరిహద్దు పొడవునా కిమ్ సర్కారు లక్షలాదిగా మందుపాతర్లు అమర్చింది. అయితే, ఇప్పుడు ఆ పేలుడు పదార్థాలు దక్షిణకొరియాలోకి కొట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై సియోల్ సైన్యం బుధవారం తమ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దక్షిణకొరియాతో ఉన్న సరిహద్దు వెంబడి ఉ.కొరియా నిర్మాణ పనులు చేపట్టింది. సరిహద్దుల్లో తమ ఫ్రంట్లైన్ భద్రతను పటిష్టం చేసుకోవడంతో పాటు సైనికులు, పౌరులు ద.కొరియాకు పారిపోకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సరిహద్దు పొడవునా అనేక ల్యాండ్మైన్లను అమర్చింది. ఉభయ కొరియాల సరిహద్దు వెంబడి దాదాపు 20 లక్షల మందుపాతర్లను కిమ్ ప్రభుత్వం అమర్చి ఉంటుందని అంచనా. అయితే, అవి ఎక్కడ ఉన్నాయో.. ఎప్పుడు పేలుతాయన్నది ఎవరికీ తెలియదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరియా ద్వీపకల్పంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేకచోట్ల వరదలు సంభవించాయి. ఈ వరద ప్రవాహంలో ఉత్తరకొరియా వైపున ఉన్న మందుపాతర్లు కొట్టుకొచ్చే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. అంతేగాకుండా ఉత్తరకొరియా రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఈ పేలుడు పదార్థాలను వరదల్లో పడేసే అవకాశముందని తెలిపారు. ఉత్తరకొరియా నుంచి వరదల్లో మైన్ బాక్సులు కొట్టుకురావడం అసాధారణమేమీ కాదు. 2015లో ఉ.కొరియా నుంచి కొట్టుకొచ్చిన ఓ ల్యాండ్మైన్ పేలి ఇద్దరు ద.కొరియా సైనికులు మృతిచెందారు. దక్షిణకొరియా కార్యకర్తలు తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా… ఉత్తరకొరియా ఇటీవల సియోల్లోకి ‘చెత్త’ బెలూన్లు పంపించిన సంగతి తెలిసిందే. దాదాపు 260 బెలూన్లలో చెత్త, వ్యర్థ పదార్థాలు, మురికి మట్టి జారవిడిచింది. గతంలో 2016లోనూ ఇలా కిమ్ సర్కారు బెలూన్లు పంపగా… వాటి కారణంగా దక్షిణ కొరియాలో కొన్ని కార్లు, ఆస్తులు దెబ్బతిన్నాయి.