కొలంబో: శ్రీలంకలోని ఆరోగ్య సంరక్షణ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్ల పరిష్కారానికి, దేశంలో సేవల మెరుగదల కోసం వచ్చే గురువారం నుంచి సమ్మెబాట పట్టనున్నట్లు హెల్త్కేర్ యూనియన్లు ప్రకటించాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత, మెరుగైన పని పరిస్థితులు వంటివి నిరసనకారులు డిమాండ్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడు రవి కుముదేశ్ వెల్లడిరచారు. తమ సమస్యల పరిష్కారానికి సముచిత సమయం ఇచ్చినప్పటికీ అందులో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని, అందుకే తక్షణమే వాటిని పరిష్కరించుకొనేందుకు నడుం బిగించి సమ్మెకు దిగబోతున్నట్లు వైద్య సిబ్బంది తరపున కుముదేశ్ తెలిపారు. వైద్య రంగంలోని పరిస్థితిని మీడియాకు తెలుపవద్దని ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల ఉపసంహరణకూ యూనియన్ డిమాండ్ చేసింది. ఇదిలావుంటే, అంతర్జాతీయ ద్రవ్యోనిధి కోరిన సంస్కరణలతో పింఛన్లకు ప్రమాదం ఉండవచ్చన్న భయంతో సోమవారం రాజధాని కొలంబోలో వెయ్యి మందికిపైగా భారీ ప్రదర్శన నిర్వహించారు. శ్రీలంకకు ఇచ్చిన బెయిలౌట్ ప్యాకేజి క్రమంలో మూడు బిలియన్ డాలర్లను వసూలు చేసే దిశగా ఐఎంఎఫ్ కొన్ని సంస్కరణలను సూచించింది. దీంతో పింఛన్లకు గండి పడవచ్చన్న భయం పింఛన్దారుల్లో నెలకొంది. ఈ క్రమంలో పింఛన్ సంరక్షణ కోసం వీధుల్లోకి వచ్చారు. శ్రీలంక దివాలా దిశకు చేరుకున్న పరిస్థితి తెలిసిందే.