వాషింగ్టన్: ముస్లింలు పవిత్రంగా భావించే రమదాన్ (రంజాన్) నాటికి గాజాలో కాల్పుల విరమణ కష్టమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఆదివారం నుంచి రమదాన్ ప్రారంభం కాబోతోంది. నెల వంక కనిపించిన తర్వాత ముస్లింలు రమదాన్ ఉపవాసాలను ప్రారంభిస్తారు. ఈలోగా కాల్పుల విరమణ జరిగే పరిస్థితి లేదని బైడెన్ స్పష్టంచేశారు. అదే సమయంలో తూర్పు జెరూసలేంలో హింసపై ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో ఇజ్రాయిల్ దురాక్రమణ కొనసాగిస్తోంది, వైమానిక, భూతల దాడులతో మారణహోమం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 82 మంది పలస్తీనియన్లు చనిపోగా మరో 122 మందికి గాయాలయ్యాయి. పౌష్టికాహార లోపం, డీహైడ్రెన్కు గురి కావడంతో అల్ షిఫా ఆసుపత్రిలో మరో ముగ్గురు పిల్లలు మృత్యువాత పడ్డారు. మరోవైపు ఆకలి చావులు సంభవిస్తున్నాయి. క్షుద్బాధతో ఇప్పటివరకు 23 మంది చనిపోయినట్లు పలస్తీనా అధికారులు తెలిపారు. ఖాన్ యూనియన్ ప్రాంతంలో 20 మంది, సెంట్రల్ గాజాలో మరో 10 మంది సాయుధులను మట్టుపెట్టినట్టు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. 37 డ్రోన్లతో గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు ప్రకటించగా, ఎర్ర సముద్రంలో హౌతీల దాడులను భగ్నం చేసినట్లు అమెరికా సైన్యం చెప్పుకుంది. ఇదిలావుంటే అక్టోబరు 7 నుంచి ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పలస్తీనియన్ల సంఖ్య 30,960కు పెరుగగా గాయపడిన వారి సంఖ్య 72,524 మందికి చేరింది.