రియో డి జనేరియో: జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధవారం రియో డి జనేరియోలో భేటీ అయ్యారు. ప్రపంచ పరిస్థితులు, అంతర్జాతీయ పాలన, ఘర్షణల, పరిష్కారాలపై చర్చించారు. బ్రెజిల్ అధ్యక్షతన ఈ వార్షిక సమావేశం జరిగింది. ఈ ఏడాది జీ20కి బ్రెజిల్ అధ్యక్షత వహిస్తోంది. దీంతో అంతర్జాతీయ పరిపాలనలో సంస్కరణలకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. వాతావరణ మార్పు సవాళ్లను అధిగమించడం, పేదరికాన్ని నిర్మూలించడంపైన పూర్తిగా దృష్టి పెట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఆగని పోరుకు తోడు గాజాలో ఇజ్రాయిల్ దురాక్రమణ కొనసాగుతుండటం, మరిన్ని పరిణామాల దృష్ట్యా మనం నేడు పాలన రహిత ప్రపంచంలో ఉన్నామని బ్రెజిల్ జీ20 షెర్పా, దౌత్యాధికారి మౌరిసియో లిరియో అన్నారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలపై ఏకాభిప్రాయం ఉన్నదని చెప్పారు. భద్రతా మండలి విస్తరణకు బ్రెజిల్ కట్టుబడి ఉందన్నారు. ఈ సదస్సు క్రమంలో అమెరికా మంత్రి ఆంటోనియో బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రో ఏడాది తర్వాత కలిశారు. గురువారం అంతర్జాతీయ పరిపాలన అజెండాతో సదస్సు జరుగుతుందని లిరియో తెలిపారు. న్యూయార్క్లో ఐరాస సర్వసభ సమావేశం జరగనున్న సమయంలో జీ20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని సెప్టెంబరులో నిర్వహించేందుకు బ్రెజిల్ ప్రతిపాదించను న్నట్లు చెప్పారు. ఈ సదస్సులో ఐరాస సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొనవచ్చని లిరియో వెల్లడిరచారు.