. ఎన్నికలను బహిష్కరించిన విపక్షాలు
. ఓటేయవద్దని ప్రజలకు పిలుపు
. వెలవెలబోయిన బూత్లు ఆగని హింస: ఒకరి మృతి
. కౌంటింగ్ మొదలు నేడు ఫలితాలు
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అక్కడక్కడ హింస చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరిగింది. అరకొరగా 30శాతంలోపు పోలింగ్ నమోదయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించింది. దీంతో భావసారూప్యతగల పార్టీలు మద్దతు తెలిపాయి. 300 నియోజకవర్గాల్లో పోలింగ్కు ఏర్పాట్లు జరుగగా ఓటింగ్ మొదలైన మొదటి నాలుగు గంటలు బూత్లన్నీ జనం లేక వెలవెలబోయాయి. రాజధాని ఢాకాలో ఉదయం 9.30 గంటల వరకు కేవలం 175 ఓట్లు పోలు కాగా ఢాకా2, ఢాకా 10లో 525 ఓట్లు వచ్చాయి. ఈ కేంద్రాలలో 5,183 ఓట్లు ఉన్నాయి. అలాగే ఢాకా
7లోని ఆజింపూర్ గరల్స్ స్కూల్, కాలేజిలో ఏర్పాటు చేసిన బూత్లో 50 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 2,914 ఓట్లున్నాయి. మధ్యాహ్నం 12 తర్వాత పోలింగ్ కాస్త పుంజుకోగా 3 గంటల వరకు 27.15శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ అధికారి జహంగీర్ చెప్పారు. అర్హులైన వారు మొత్తం ఓటర్లు 11.96 కోట్ల మంది కాగా 27 పార్టీలకు చెందిన 1,500 మందితో పాటు 436 మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీలో నిలిచారు. పోలింగ్ ముగియడంతో సాయంత్రానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఫలితాలు 8న వెల్లడనున్నాయి.
12 గంటల్లో 15 ఘటనలు
పోలింగ్కు ముందు రోజు నుంచి అనేక ప్రాంతాల్లో హింస చెలరేగింది. 12 గంటల్లో మొత్తం 15 ఘటనలు నమోదయ్యాయి. పోలింగ్ కేంద్రాలుగా నిర్దేశించిన నాలుగు విద్యాసంస్థలకు దుండగులు నిప్పు పెట్టారని, మూడు బస్సులు, మూడు లారీలు, ఒక ట్రక్కు, కారు, రెండు బైకులను దగ్ధం చేశారని కమిషనర్ కార్యాలయం వెల్లడిరచింది. ఆదివారం ఉదయం 6గంటలకు ఓ పడవను తగలబెట్టారని తెలిపింది. ఢాకాలో రెండు, ఛత్తోగ్రామ్, మైమెన్సింగ్ డివిజన్లలో మూడు చొప్పున, బారిసల్ డివిజన్లో నాలుగు, ఖుల్నా, సైల్హెట్, రంగ్పూర్ డివిజన్లలో ఒకొక్కటి చొప్పున నిప్పుపెట్టిన ఘటనలు నమోదయ్యాయి. 30కుపైగా ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేందుకు శ్రమించినట్లు ప్రభుత్వ డేటా వెల్లడిరచింది.
వ్యక్తిని పొడిచేసిన స్వతంత్ర అభ్యర్థి
పోలింగ్ రోజు జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. పదునైన ఆయుధంతో స్వతంత్ర అభ్యర్థి పొడవడంతో అతను చనిపోయాడు.
విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. ఛత్తోగ్రామ్లో బీఎన్పీ సభ్యులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఎన్నికల ముందు రోజు పాసింజర్ రైలుకు నిప్పుపెట్టగా నలుగురు మరణించారు.
ఇవి విశ్వసనీయత లేని ఎన్నికలు` ఓటువేయొద్దు: బీఎన్పీ
బీఎన్పీ, జామాతే ఇస్లామీ, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్తో పాటు ఇతర విపక్ష పార్టీలు రెండ్రోజుల సమ్మెకు ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం ఆందోళనలు జరిగాయి. ఎన్నికలను బహిష్కరించాలని, ఓటు వేయొద్దని బంగ్లాదేశ్ ప్రజలకు విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ రాజీనామాను డిమాండ్ చేశాయి. తటస్ఠ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే ఎన్నికలు జరిపించాలన్నాయి. ఇది కొత్తేమీ కాదని, గతంలో చాలాసార్లు జరిగిందని వాదించాయి. ప్రస్తుత ఎన్నికలకు విశ్వసనీయత లేదని ఆరోపించాయి. స్వతంత్ర అభ్యర్థులుగా ‘డమ్మీ’లను అధికార పక్షం ప్రోత్సహించిందని దుయ్యబట్టాయి.
10వేల మంది ముందస్తు అరెస్టు
10వేల మంది ప్రత్యర్థి పార్టీల నేతలు, మద్దతుదారులు ముందస్తు అరెస్టు అయ్యారు. వీరిపై రైలుకు నిప్పు పెట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అరెస్టులు రాజకీయ కక్షసాధింపులో భాగం కాదని సమర్థించుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు జరిగాయని పేర్కొన్నాయి.