చిలీలో టీచర్ల 48గంటల సమ్మె
శాంటియాగో : చిలీలోని కాలేజి టీచర్లు 48గంటల సమ్మె చేశారు. దేశ అధ్యక్షులు గేబ్రియల్ బోరిక్ యంత్రాంగం తమ డిమాండ్లను పరిష్కరించడంలో వహిస్తున్న అలసత్వానికి నిరసనగా సమ్మెబాట పట్టారు. ఎనిమిది ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాన్ని విద్యాశాఖకు సమర్పించారు. రిటైర్మెంట్ బోనస్ల చెల్లింపులో జాప్యాన్ని పరిష్కరించడం, పని భారం తగ్గించడం, మెరుగైన పని పరిస్థితుల కల్పన, స్కూల్లో హింసకు పరిష్కారం చూపడం వంటి డిమాండ్లు చేసినట్లు కాలేజి టీచర్ల సంఘం అధ్యక్షుడు కార్లోస్ డియాజ్ తెలిపారు. దేశ నలుమూలల నుంచి ప్రొఫెసర్లు వందలలాది మంది చిలీ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయమున్న వల్పారైసోకు చేరుకొని భారీ ప్రదర్శన నిర్వహించినట్లు వెల్లడిరచారు. ‘చారిత్రక అప్పు’ను చెల్లించాలని బోరిక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1973 నుంచి 1990 వరకు అగస్టో పినోచెట్ నియంత పాలనలో వేలాది మంది టీచర్లు తమ వేతనాల్లో కోతలను అనుభవించారు. దానినే ‘చారిత్రక అప్పు’గా వ్యవహరిస్తున్నారు. నాడు ప్రభుత్వ స్కూళ్ల యాజమాన్యాలను మున్సిపాలిటీలకు బదిలీ చేసిన ఫలితంగా అనేక ఏళ్లు ఉద్యోగులకు వేతన సంస్కరణలు లేకుండా పోయాయి. దీంతో 65వేల మంది బాధిత టీచర్లకు ఏడు బిలియన్ డాలర్ల మేర చిలీ ప్రభుత్వం రుణపడి ఉందని ఆందోళనకారులు తెలిపారు. 17వ తేదీలోగా రాజీ కుదరని పక్షంలో నిరవధిక సమ్మెను దేశవ్యాప్తంగా చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.