- ఏపీ ఎస్ఆర్ఎం ‘రీసెర్చ్ డే’లో ప్రొఫెసర్ యూబీ దేశాయ్
- విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లకు గోల్డ్ మెడల్స్ ప్రదానం
విశాలాంధ్ర`విజయవాడ : పరిశోధనలతో కూడిన పాఠ్య ప్రణాళికల ద్వారా విద్యార్థుల మేథస్సుకు పదును పెట్టాలని హైదరాబాదులోని అనురాగ్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ యూఖీ దేశాయ్ అన్నారు. పరిశోధనలకు ఆకర్షితులయ్యే విధంగా ఆయా యూనివర్సిటీల బోధనా ప్రణాళికలు ఉండాలని పేర్కొన్నారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తన మూడవ ‘రీసెర్చ్ డే’ కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించింది. ముఖ్య అతిథిగా దృశ్యమాధ్యమ (వర్చువల్) పద్ధతిలో హాజరైన యూబీ దేశాయ్ దేశంలో 5జీ పురోగమనంపై ప్రసంగించారు. రానున్న దశాబ్దంలో శాస్త్ర, సాంకేతిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని, దేశంలోని శాటిలైట్ కమ్యూనికేషన్స్, వైర్లెస్ వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పారు. 5జీ టెక్నాలజీ పరిణామ క్రమాన్ని వివరిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి టెక్నాలజీలకు ప్రాముఖ్యత మరింత పెరుగుతుందన్నారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీఎస్ రావు మాట్లాడుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020లో పేర్కొన్న విధంగా యూజీ, పీజీ స్థాయి బోధనాంశాల్లోనూ పరిశోధనలకు ప్రాముఖ్యత కల్పించడం అవసమని పేర్కొన్నారు. ప్రో వైస్ చాన్సలర్ ఆచార్య డి.నారాయణరావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో పరిశోధనల పాత్ర కీలకమన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ స్టూడెంట్స్ రీసెర్చ్ బేస్డ్ సెంటర్ కలిగి ఉందని, టెక్నాలజీకి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్ది, ఆ దిశగా విద్యార్థులను, ఫ్యాకల్టీలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథి యూబీ దేశాయ్ తరఫున వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వీఎస్ రావు రీసెర్చ్ డే అబ్స్ట్రాక్ట్ బుక్లెట్ను ఆవిష్కరించారు.
విద్యార్థులకు గోల్డు, సిల్వర్ మెడల్స్…
పరిశోధనలలో విశేష ప్రతిభ కనబరిచిన 36 మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లకు యూనివర్సిటీ గోల్డు, సిల్వర్ మెడల్స్, ప్రశంసాపత్రాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో డెప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ శివకుమార్, అసోసియేట్ డీన్ రఘనాథన్, స్కూల్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ డీన్ బండి కామయ్య, రీసెర్చ్ డే కన్వీనర్లు డాక్టర్ కార్తీక్ రాజేంద్రన్, డాక్టర్ మహేశ్, డాక్టర్ మురళి, ప్రొఫెసర్ రంజిత్ తాపా, డాక్టర్ షీలాసింగ్ తదితరులు పాల్గొన్నారు.