విశాలాంధ్ర, పెద్దకడబూరు : ఈనెల 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ ను ఆదేశించారు. గురువారం పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ల జాబితాలో ఫామ్ – 6 లో పేర్లు నమోదు చేయించాలని సూచించారు. ఇతర పట్టణాలలో స్థిరపడినవారు, మరణించిన వారి పేర్లను ఫామ్ – 7 నమోదు చేసి తొలగించాలన్నారు. మంత్రాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం పెద్దకడబూరులోని ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయంలోని పోలింగ్ బూతులను పరిశీలించారు. ఈమె వెంట రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ మహేష్, వీఆర్వో నరసప్ప తదితరులు ఉన్నారు.