సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య
విశాలాంధ్ర -ఆలూరు : నియోజకవర్గం సస్యశ్యామలానికై వేదావతి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని సిపిఐ పొరపాటుకు సిద్ధమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య అన్నారు. గురువారం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరిహారము, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆలూరు, మొలగవల్లి, పెద్దహోతూరు గ్రామ సచివాలయ కేంద్రాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహించారు. పెద్దహోతూరు గ్రామ సచివాలయ కేంద్రం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఆలూరు అని, నియోజకవర్గం సస్యశ్యామలం కావాలంటే ఏకైక పరిష్కారం వెధవతీ ప్రాజెక్టును 8 టిఎంసిలు సామర్థ్యంతో నిర్మాణం చేపట్టి, అన్ని గ్రామాలకు సాగు, త్రాగునీరు అందించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ వేదవతి ప్రాజెక్టుకు కేవలం 16 ఖర్చుపెట్టి చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు చేయకుండా ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం వేదావతి ప్రాజెక్టు కోసం నిధులు సాధించకుండా ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు. ఆలూరు లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గుమ్మనూరు నియోజకవర్గ ప్రజలను విస్మరించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో త్రాగడానికి సైతం నీళ్లు దొరకడం లేదని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అభివృద్ధిని మరిచి మంత్రి చరిత్ర హీనుడిగా నిలిచిపోయాడన్నారు. ఆస్పరి మండలానికి ఎటువంటి నీటి వనరులు లేకపోవడంతో అక్కడి ప్రజల అవస్థలు మరింత దుర్భరంగా ఉన్నాయని, ప్రాజెక్టు పరిధిలోకి ఆస్పరి మండలాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయా గ్రామాల సచివాలయ కేంద్రాలలో పంచాయితీ కార్యదర్శులకు వినతి పత్రాలను అందజేశారు. సీపీఐ జిల్లా నాయకులు భూపేష్, మండల కార్యదర్శి రామాంజనేయులు, నాయకులు చంద్రకాంత్ రెడ్డి, హోతురప్ప, నాగరాజు, వన్నూరు వలి, మునిస్వామి ఏఐఎస్ఎఫ్ నాయకులు దుర్గానాయక్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.